పేజీలు

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

 

మార్క్సిజం భౌతిక వాదం – మనషి భావాలు

19-09-2020 రోజున  వాట్సాప్ లో   అహ్మద్ ఫార్వార్డ్ చేసిన వ్యాసాన్ని చదివిన తర్వాతా  ఇది రాయాలనిపించింది. వ్యాస కర్త  పేరు బయట పెట్టడం అనవసరం అనిపించిది.  స్థూలంగా ఆ రచయిత్రి గారు చెప్పింది :  మానవ సమాజం పుట్టిన తర్వాతే దోపిడీ వ్యవస్థ పుట్టింది.  అంతకు ముందు దోపిడీ ఉండేది కాదు.  ఆ రచయత్రి గారు ఇంకా చాలా విషయాల గురించి ప్రస్తావించారు కానీ నేను ఇక్కడ వాటిని విశ్లేషించే ప్రయత్నం చేయలేదు.  ఇంతకీ అహ్మద్ ఎవరూ?  నా చిరకాల మిత్రుడు. సమాజాన్ని గురించి ఒక లోతైన అవగాహనతో  ఆలోచించ  గల  మేధావి అంతకు మించి ఒక క్రిటిక్ . ఈ కాంటెక్స్ట్ లో ఆయన గురించి ఇంతకంటే పరిచయం అవసరం లేదని నా అభిప్రాయం. మరో సందర్భంలో ఆయన గురించి తెల్సుకుందాం.  

వడ్డీ వ్యాపారం గురంచి రాసిన  ఆ వ్యాసం మొదటి పేరాగ్రాఫ్లో  రచయిత్రి గారు  వేల వేల సంవత్సరాల వెనిక్కి వెళ్ళి మనవ పరిణామ క్రమాన్ని ప్రస్తావించారు. కానీ అందులో కూడా నాకు మతం తాలూకు ట్రేసెస్ కనిపించాయి.  ఎందుకంటే దాదాపు  అన్ని మతాలు  మనిషిని ఆల్ ఆఫ్ సడన్గా   దేవుడు సృష్టిందాడనే ఒక అశాస్త్రీయ పునాది తోనే తమ సూడో  ప్రపంచాలను  ఫ్యాబ్రికేట్ చేయడం  మొదలు పెడతాయి. ఇక్కడ రచయిత్రి  గారు కూడా అదే పని చేసారు. “మిగులు” ను దోపిడీ చేయడం మనిషి మాత్రమే చేస్తాడనే ఒక బేసిక్ హైపోతిటికల్ కాన్సెప్ట్ తో ఉన్నట్లు అనిపించింది  కానీ  అసలు మిగులు కంటే ముందు కూడా దోపిడీ ఉండేదని నా అభిప్రాయం (subject to strict scrutiny and criticism) బలవంతుల దౌర్జన్యాలు మోసాలు, కుట్రలు కుతంత్రాలు  మిగులు దోపిడీ  కు ముందు రూపాలు. అవి ఇప్పటికీ ఉన్నాయనుకోండి.  కానీ మిగులు దోపిడీకి  కు తాత ముత్తాతలు దౌర్జన్యాలు.  దౌర్జన్యం అనేది బహురూప ప్రక్రియ అందుకే  దౌర్జన్యా-లు అని వాడాను ఇక్కడ.  మిగులు దోపిడీకి  మెటామార్ఫ్ అయ్యే లక్షణం ఉంది. అది తన రూపు మార్చు కొన్న ప్రతీ సారీ  దోపిడీ రూపాలు కూడా  మారతున్నాయి. ఇప్పుడు అన్ లైన్ డిజిటల్ ద్రవ్య మార్పిడి మొదలయిన తర్వాతే ప్రపంచ కుబేరుల ఆస్థుల పెరుగుదల రేటు (గ్రోత్ రేట్)  మరింత ఎక్కువయింది. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ లు ఈ కోవలోకే వస్తాయి.  ఒకప్పుడు ఒక చేపకు స్వార్ధం పెరిగో లేక  ఒక అనివార్య దశలోనో లేక  అనుకోకుండా ఆహారం అధికంగా దొరికినందువల్లో లేక ఇతర చేపలను బెదిరించో   కారణం ఏదైనా మిగతా చేపల కంటే కొంచం బలంగా తయారయింది.  అక్కడే డార్విన్ చెప్పిన జనరేషన్ చేంజ్ లేక షిప్ట్  మొదలయింది. అంటే డార్విన్ చెప్పిన అనేక విషయాలలో ఇదొక చిన్న అంశం మాత్రమే. అంతేగానీ డార్విన్ పై ఇది  ఏక వాక్య  కంక్లూజివ్ కామెంట్ కాదు.   ఆ తర్వాత  ఆ చేప తన స్వజాతి చేపలనే తినడం మొదలు పెట్టింది   ఆ చేపే తిమింగలంగానో   సొర చేపగానో తర్వాతి కాలంలో రూపాంతరం చెంది ఉండాలి. ఇది జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిండుడాలి. డైనోసార్లు ఇంకా  అనేక జీవరాసులు అలా తమ ఆకారాలను పెంచుకున్నాయి. ఎందుకంటే అప్పట్లో మిగులు కేవలం ఆహారం రూపంలో మాత్రమే ఉండేది. దాన్ని దాచుకోవడానికి వాటికి గాదెలు గోదాములు  బ్యాంకులు, లాకర్లు  లేవు కాబట్టి తమ శరీరాలనే గాదేలుగా లేక బ్యాంకులుగా వాడుకున్నాయి. అందుకే వాటి ఆకారాలు అలా పెరిగిపోయాయి,  గద్ద తన ఇతర చిన్న పక్షి జాతులను పలహారం చేస్తే, పాములు తన దాయాది సరీసృపాలను తింటుంది.  ఇప్పటిదాకా చెప్పుకున్న సంగతి సారాంశం,  మిగులు దోపిడీ కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు పైగా ఇది టైం టు టైం  మెటామార్ఫసిస్ కు లోనవుతుంది. ఆ డైనమిక్స్ ను కూడా అర్ధం చేసుకుంటే తప్ప దాన్ని నివారిచండం సాధ్యం కాకపోవచ్చు.

     మార్పు మనిషి నుంచే మొదలు కావాలని గాంధీ లాంటి వాళ్ళు వాదిస్తే సమాజం నుంచి మొదలు పెట్టాలని మార్క్స్ లాంటి వారు  వాదించారు. కానీ రెండూ ఫేలయ్యాయి. శ్రామికులకు రాజ్యాధికారం వస్తే మనిషి మారతాడన్నప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోయింది. ఇక కుటుంబం,  మతం, కులం కుటుంబం చివరికి రాజ్యం సైతం మనిషిని కంట్రోల్ చేయలేక పోతున్నాయి.

ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది.  మార్క్స్ భౌతిక వాదం ప్రీ హిస్టారిక్ ప్రిమిటివ్ సమాజం నుండి ఫ్యూచర్ సోషలిస్ట్ సమాజ నిర్మాణం వరకూ వెళ్లి  మనిషి దగ్గరికి రాగానే ఎందుకు ఆగిపోయింది?  మనిషిని పూర్తి పాజిటివ్ గా చూసి లోప రహితుడిగా,  దోష రహితుడుగా    అంటే శ్రామిక వర్గం తాలూకు (at least Proletariat human being) మనిషిని  మంచి   వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది. చిన్న పిల్లలు సైతం తోటి పిల్లల ఆట వస్తువులు, తినే వస్త్తువులు లాక్కునే ప్రయత్నం చేస్తారు. అంతేగాక వాళ్ళలో కూడా అవినీతి లక్షణాలు కనపడతాయి. మన మాట వినని పిల్లలకు చాక్లెట్  లంచం ఎరచూపుతాము.  అలాగని వాళ్ళని తప్పు పట్టే ఉదేశ్యం లేదు. మొత్తంగా ఇక్కడ చెప్పదలుచు కున్న విషయం ఏమిటంటే మనలో  అంటే ప్రతీ వ్యక్తిలో ఎక్కడో దోపిడీ మూలాలు దాగున్నాయి. ఆ మూలాలను రాజ్యంలోనో,  సమాజంలోనో, కుటుంబం లోనో ఉన్నాయనుకుని చికిత్స చేసే పనిలో ఉన్నాము.  చేతికి దెబ్బ తగిలితే కాలికి కట్టు కడుతున్నామేమో ఆలోచించాలి.  

     మనిషిలో కనిపించే అనేక భావోద్రేకాలు మన చుట్టూ ఉండే  సామాజిక, ఆర్ధిక,  భౌతిక అంశాలపై తోసేసి మన తప్పేమీ లేదని  చేతులు దులుపు కుంటున్నాము.  కానీ అవి బయట లేవని మనలోనే ఉన్నాయని తెలుసుకోలేక పోతున్నాము.  ఈ ప్రయత్నం కొన్ని వేల సంవత్సారాల క్రితమే మొదలయ్యిందని మీరు అనుకోవచ్చు.  దేవుడు, మతం, భక్తీ,  మనషి ఆత్మను ప్రక్షాళనం చేసే ప్రయత్నం చేస్తాయి  కాబట్టి  దేవుణ్ణి మతాన్ని  నమ్ముకుని ఎవరికీ వారు తమలో  ఉండే మురికిని కడిగేసుకోవచ్చు అని ఈజీగా చెప్పే వాళ్ళున్నారు. ఒక వేళ అదే నిజమైతే వివిధ మాతచార్యులు చేసే అకృత్యాలు ఎలా జరుగుతున్నాయి. సమాజంలోని అందరి కాలుష్యాన్ని కడిగి పారేసే వాళ్ళు తమ స్వంత మురికిని కడుక్కోలేరా?   అందుకే  మతం ఈ విషయంలో సక్సెస్ కాలేదని  మనందరికీ తెల్సు. మరి పరిష్కారం ఎక్కడ  వెతుకుదాం. మనలోనా? సమాజంలోనా? మతం లోనా?  ఈ ప్రశ్నకు సమాదానం చెప్పే  శక్తి కేవలం సైన్సుకే వుంది.  అయితే సైన్సు కూడా పెట్టుబడీ దారుల చేతుల్లోకి వెళ్లి పోయిందనే వాదన ఉంది.  

కానీ సైన్సు ఎవరి సొత్తు కాదు. సైన్సు యూనివర్సిటీలలో, పెద్ద పెద్దల్యాబుల్లోనో, ఖరీదైన పరికరాల్లోనో ఉంటుందనే భావ దారిద్ర్యంలో ఉండే వారికి నేను చెప్పేదేమీ లేదు. ప్రపంచాన్ని సమూలంగా మార్చేఅతి పెద్ద ఆవిష్కరణలు మాత్రేమే సైన్స్ మిగతావాటిని చిల్లర సైన్సు చేష్టలు అనుకునే వారికి కూడా నేను దూరంగా ఉంటాను. ఇక మత గ్రంధాలలో ఉన్నది మాత్రమే సైన్స్ అనుకునే వారితో వాదించటం అనవసరం సైన్సు కు చిన్న పెద్ద తేడా లేదు దానిపై ఎవరి గుత్తాధిపత్యం చెల్లదు. అది ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక కాలానికో పరిమితం కాదు. అది నిరంతరం అవిశ్రాంతంగా కొనసాగే ఒక సాధారణ ప్రక్రియ. ఇంకా గట్టిగా వాదిస్తే రోజు వారీ జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు మతేతర పరిష్కారాలు కనుగునే ప్రయత్నం చేస్తున్న ప్రతీ వ్యక్తి ఒక సైన్టిస్టే . వాళ్లకు ఎలాంటి డిగ్రీలు ఉండవు, పేటెంట్లు ఉండవు. 

మనలో ఉండే భావోద్రేకాలకు కావలసినంత రా మెటీరియల్ మనలోనే ఉంది. సెక్సు కోరికలకు కారణం హార్మోన్లంటారు. స్వార్ధానికి, అసూయకు,  భవిష్యత్తు గురించిన ఆలోచనలకు, అందరిపైనా పెత్తనం చెలాయించాలనే రాజకీయ కోరికలను ప్రేరేపించే దుర్భుద్దీ ఇవన్నీ కూడా మనలో ఉండే భౌతిక రసాయన ప్రక్రియల  తాలూకు బాహ్య రూపాలు.  కాబట్టి  మార్క్స్ భౌతిక వాదం ఆర్ధిక రాజకీయం వంటి మాక్రో లెవల్  అంశాలకే పరిమితం కాకుండా ఇంకా మైక్రో లెవల్ కు కూడా వెళ్ళగల్గితే బావుండేది .  ఒక్క అసూయకు కారణం, మందు కనిపెట్ట గలిగితే చాలు సమకాలీన సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే అంక్జైటీ న్యురోసిస్ వంటి వాటికి మందులున్నాయి అంటారు. అలాగే పిచ్చి వాళ్లపై కూడా కొన్ని మందులు పనిచేస్తాయి. కొందరు ప్రతీ పనిలో నెగెటివ్ అంశాలు మాత్రమే చూస్తారు మరికొంత మందికి పాజిటివ్ మాత్రమే కనపడుతుంది.    మనిషిలో ఉండే భావోద్రేకాలు బయలాజికల్ అనివార్యాలా లేక  సోషల్ రిడన్డెసీలా అన్న విషయం  తేలాలి. ఎందుకంటే భయం కూడా ఒక భావమే మనిషి నుండి భయాన్ని తొలగిస్తే చాల సమస్యలోస్తాయి.  పాజిటివ్ ఆలోచనలతో పాటు నెగిటివ్ ఆలోచనలు కూడా అవసరం విమానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తకు దాన్ని గాలిలో ఎగిరేయ గల్గితే సరిపోదు దాన్ని కిందకు ఎలా దించాలో కూడా తెలియాలి. శాస్త్ర పరిశోధన ఇంకా చాలా ముందు కెళ్తే తప్ప సామాజిక రుగ్మతలకు పరిష్కారం దొరకదు.  భూమి కోసం రాజకీయ పోరాటమే కాదు శాస్త్రీయ పరిశోధన కూడా అవసరం. భూమి లేక పొతే దాన్ని సృష్టించే శక్తి సైన్సుకు ఉంది శూన్యంలో పంటలు పండించగల తెలివి శాస్త్ర విజ్ఞానికి ఉంది.  సెప్టిక్ టాంక్ మరుగుదొడ్డి  కనుగొనక పొతే నెత్తిన చీపురు  బకెట్ పెట్టుకుని ఇంటింటికి తిరిగే స్కావెంజర్ వ్యవస్థ ఇంకా ఈ రోజు కూడా సజీవంగా  ఉండేది.  అలాగని ఆ వ్యవస్థ  పూర్తిగా పోయిందన్న అపోహలో ఉండకండి. డ్రైనేజి మాన్ హోల్లో దిగి చెత్తను తొలగించి మురికి నీటికి దారిని క్లియర్ చేసే మున్సిపల్ ‘చెత్త మనిషి’ రూపంలో, మన ఇంట్లో సెప్టిక్ టాంక్ నిండి నప్పుడు దాన్ని ఎత్తి పోసే వ్యక్తుల రూపంలో ఇంకా బతికే ఉంది. జేసీబీలు, బుల్డోజర్లు  కనిపెట్ట బడక పొతే తట్టా, పారా,  గునపాలకు ఇంకా ఫుల్ గిరాకీ ఉండేది.     అంతెందుకు కార్లు, రైళ్ళు, బస్సులు  ఇంకా హైడ్రో కార్బన్ లేక విద్యుత్  చోదక యంత్రాలు లేక పొతే ఇంకా పల్లకీలు, మేనాలు తప్పక బతికి ఉండేవి.    ఇంతకీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం సూటిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే చాల మంది మార్కిస్టు లకు రాజకీయ పోరాటాలపై ఉన్న నమ్మకం సైన్సు పై లేదు. అలాగని ఆర్ధిక రాజకీయ పోరాటాలను తక్కువ చేసి చూపించే ఆలోచన లేదు.  మార్క్స్ చెప్పిన చరిత్ర దశల ట్రాన్సిషన్ లో సైన్సు పాత్రను పూర్తిగా విస్మరించారో లేక దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదో  తెలియదు. మన చుట్టూ ఉండే ప్రజల సమస్యలకు రాజకీయార్ధిక పరిష్కారాలతో పాటు సైంటిఫిక్ ఆవిష్కరణలు తోడైతే సమాజ మార్పు వేగం పుంజుకుంటుందని నా ఆశ. చివరిగా మనిషిని అంతర్గతంగా  మతం దృష్టిలో కాకుండా మార్క్స్ పంథాలో భౌతిక వాద దృష్టిలో స్కాన్ చేసి భావోద్రేకాలకు మనిషిలో భౌతిక రసాయనిక చర్యలను కనుగొని వాటిని నియంత్రించ గల్గితే ప్రయోజనం ఉండొచ్చు.  మార్క్సిజాన్నీ ప్రశ్నించే సాహసం చేసిన  నా అవివేకాన్ని మన్నించాలని   కొరుతూ  - ప్రదీప్    

 

 

27, ఆగస్టు 2020, గురువారం

 ఐడియా ఒక మిత్రుడిది  అక్షరీకరణం నాది. ఆయన కోరిక మేరకు ఫేస్ బుక్ లో లింక్ ఇస్తున్నాను.  నిజానికి దీన్ని 2016 లోనే ఈ బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది - ప్రదీప్

 

గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమేనా ? !

పట్టణీకరణం సాధరణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కనిపించే  ఒక అనివార్య దశ అని చాలామంది భావిస్తారు  .  అయితే ఇది  నాణానికి ఒక వైపు చిత్రం మాత్రమే.  నిజంగా ఇది అనుకున్నంత పెద్ద సమస్య కాదు. ఈ మధ్య ఒక ఒక కొత్త ట్రెండ్ మొదలయ్యింది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలను పట్టణాలను వదిలి గ్రామాలకు రివర్స్ వలస పోతున్నారు. 

గ్రామాలను అభివృద్ధి వైపా? లేక అభివృద్ధిని  గ్రామాల  వైపా ?  
Should Development  lead towards Village ? Or should Village lead Towards Development?


         పై రెండు ప్రశ్నలు ఒకటే కదా అనిపిస్తుంది.  కానీ సూక్షంగా చుస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక ఏ అదిలాబాద్ జిల్లా  లోనో, నిజామాబాద్ లోనో  ఒక మారుమూల గ్రామాన్ని తీసుకుందాం.  ఆ గ్రామం జిల్లా రాజధానికి (హెడ్ క్వాటర్) 30 కిలోమీటర్ల దూరంలొ ఉందనుకుందాం. అ గ్రామ జనాభా 5 నుండి 10 వేలు అనుకుంటే  ఆ గ్రామానికి కనీస  సౌకర్యాలు అంటే విద్యుత్తు, రోడ్డు  వంటివి కల్పించడం  పెద్ద సమస్య కాదు. కానీ ఒక కార్పొరేటు హాస్పటల్ ఒక డిగ్రీ కాలేజ్, పిజి కాలేజ్, లాంటివి   కల్పించండమంటేనే సమస్యలొస్తాయి. 5, 10 వేల జనాభా కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే ఏ ప్రభుత్వమైనా కొంచం ఆలోచిస్తుంది.   సాధారణంగా బతుకుతెరువు , ఉద్యొగం, పిల్లల చదువులు, వైద్య అవసరాలు గ్రామీణులను పట్టణాల  వైపు లాగుతున్నాయి. అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ప్రతీ గ్రామానికి మోసుకెళ్ళడం కంటే కొన్ని గ్రామాలను అభివృద్ధి వైపుకు మళ్లించడం సులభం అనిపిస్తుంది.  అదెలాసాధ్యమో చూద్దాం.  

        ప్రతీ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ మండలంలోని ప్రతి గ్రామం లోని ప్రతి  కుటుంబానికి మండల కేంద్రంలో (మండల హెడ్ క్వార్టర్లో) గృహ సౌకర్యం కల్పిస్తే  ప్రజలను గ్రామం తో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే వారి  కుటుంబాలను బస చేయించ వచ్చు. ఇప్పడు కడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి మండల హెడ్ క్వార్టర్ లలో అపార్ట్మెంట్ ల లాగా మల్టి స్టోరీ  గృహల  నిర్మాణం చేసి ఇవ్వవచ్చు.    అన్నిగ్రామాల ప్రజలకు మండలంలో చోటు కల్పించడంతొ మండలాల సైజు పెరిగి అవి మధ్య రకం పట్టణాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పుడు గ్రామాలను కేవలం వ్యవసాయ కార్య కలాపాలకు మాత్రమే పరిమితంచేయవచ్చు. ఇక ఈ కాలంలో రవాణా సౌకర్యాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే సగం కంటే అధిక జనాభాకు స్వంత వాహనాలు (కనీసం ద్విచక్ర వాహనాలు) ఉన్నాయి.  కాబట్టి గ్రామానికి పట్టణానికి మధ్య రాక పోకలకు పెద్ద సమస్య ఉండక పోవచ్చు. లేదా పబ్లిక్ రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయవచ్చు.  అప్పుడు  మధ్య రకం నగరాలుగా మారుతున్న మండల హెడ్ క్వార్టర్లలొ అన్ని రకాల సివిక్ సౌకర్యాలతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఫలాలను అందరికి అందుబాటులో తేవచ్చు. 
         అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ఇలా ఉండాలి. 
1.  ప్రతిమండలంలొ ప్రభుత్వ భూములను గుర్తీంచి వాటిలో పేదలకు ఉచిత లేక నామమాత్రపు ధరలకు గృహ వసతి కల్పించాలి. అవి అనివార్యంగా ఫ్లాట్ల (మల్టీ స్టోరీ బంగళాలలో ఒక రెండు  గదుల వసతి మాత్రమే కల్పించాలి.  కాస్త ఆర్ధిక స్తోమత ఉండి స్వంత, స్వతంత్ర (ఇండిఫెండెంట్) ఇల్లు కట్టుకోగలవారికి వంద గజాల స్థలం వరకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలలొ సగం కానీ అంతకెంటే వీలయితే ఇంకా తక్కువకు రిజిస్ట్రేషన్ చేసిచ్చే వీలు కల్పించాలి.  అంత కంటే ఎక్కువయితే  రిజిస్ట్రేషన్ చార్జిలను రెట్టింపు చెయాలి.  ఎందు కంటే  గృహ అవసరాలకోసం  భూమలవినియోగాన్ని తగ్గ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక ఎకరాలకు ఎకరాలు, వేల గజాల జాగా కొద్ది మంది కబ్జాలో ఉండి అనవసరంగా భూముల ధరలను పెంచుతున్నారు. వారి బారి నుండి భూమిని విముక్తం చేసి దాన్ని అందరికి అందుబాటు లోకి తెవడానికి వివక్ష పూరిత రిజిస్త్రేషన్  చట్టం (Discriminating Registration Rules)  రూపొందించాల్సిన అవసరముంది.  ఇటువంటి చట్టాలు హైదరాబాద్ వంటి నగరాలకు సైతం వర్తించేలా చూడాలి. ఈ మొత్తం వ్యాసం ఉద్దేశాన్ని తక్కువ మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు 
 " గ్రామాలను కేవలం వ్యవసాయానికి పరిమితం చేసి, గ్రామస్థుల కు పట్టణాల్లో నివాసానికి అనుకూల వాతావరణం  కల్పిస్తే ,  పట్టణాలను గ్రామాల పక్కనే అభివృద్ధి చేస్తే గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమే !
 

25, ఆగస్టు 2020, మంగళవారం

 రాజ్యం - ఆత్మ కథ 


రాజ్యం ఆత్మకథ నేపధ్యం 

 గతంలో అంటే చాలా రోజుల కింద కాదు కాదు కొన్నేళ్ల కింద కళా  రూపాలను విద్య కోసం ఎందుకు వాడుకోకూడదు అనే ప్రశ్న వేసాను.  పెద్దగా స్పందన రాలేదు.  ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ఆ ప్రశ్న ఇంకా నన్ను తొలుస్తూనే  ఉంది.  చివరికి ఆ ప్రయత్నం నానుంచే మొదలు పెడదామని అనిపించింది.   ఆ ఆలోచనలలొంచే పుట్టిందే ఈ రాజ్యం ఆత్మకథ.  ఇది ఒక రూపం మాత్రమే.   ఇదే అంశాన్ని ఇంకా చాలా రకాలుగా  చెప్పొచ్చొ  ఆలోచించండి. విద్యార్థులను ఒకే రకమైన పాఠం వినే దురదృష్టం నుండి బయట పడేయాలంటే ఇలాంటి అనేక కళా రూపాల్లో అకాడమిక్ టాపిక్స్ ను విస్తృతంగా రచించాలని మేధావులను కోరుతూ  -  ఇప్పటికి సెలవు.  ఇక రాజ్యాన్ని పెర్సానిఫై చేసి ఒక రచయితగా నేను అందులోకి పరకాయ ప్రవేశం చేసాను  నా ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో మీరే చెప్పాలి.  - మీ ప్రదీప్     

 ఇంకో చిన్న రిక్వెస్ట్.  చిన్న చిన్న భాషా దోషాలను పెద్దగా పట్టించుకొవద్దని మనవి 

నా ప్రియమైన  పౌరులారా

మై డియర్ సిటిజన్స్  


నేనెవరో గుర్తు పట్టరా? లేదా ! పరవాలేదు.  చాలా మందికి నా గురించి తెలియదు.   కొద్ది మందికి  మాత్రమే  నా గురించి తెలుసు . ఇదివరకు నా గురించి పెద్దగా తెలియక పొయినా గడిచిపోయింది.  కాని రోజులు మారుతున్నాయి నా స్వరూప స్వభావాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ  నాగురించి తప్పనిసరిగా తెల్సుకోవాలి.  ఎవరండీ మీరు?! కంటికి కనపడకుండా  ఏంటో చెప్తున్నారు? అని అనుకుంటున్నారా? తొందర పడకండి ఒక్కొక్కటిగా అన్నీ వివరిస్తాను…  


ముందుగా నేనెలా ఉంటానో చెప్తాను.  అవునూ..  నేనెలా ఉంటాను…. ?  అసలు నాకు ఒక ఆకారం ఉందా…. ?  లేదు!  ఎప్పుడైనా ఆకాశంలో మేఘాలను చుశారా? వాటికి ఒక ఆకారం ఉందా? లేదుకదా! అలగే నాకూ ఆకారం లేదు. మబ్బులు తమ షేపులు మార్చినట్లే నా ఆకారం కూడా అప్పుడప్పుడు మారుతుంది.  మరి నన్నేలా గుర్తు పట్టడం అంటారా?  నో ప్రాబ్లమ్!  మీకు రెండు కాళ్ళు, రెందు కళ్ళు, చేతులు ఉన్నట్లే నాకు కుడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. నా లక్షణాలలో  మెదటిది అంటే పౌరులు,  ఇంగ్లీషులో పీపుల్ అంటారు.  అంటే    అంటే మీరు.  రెండవది మీరు ఉంటున్న భూమి అంటె ప్రదేశం.  ఇంగీషులో టెర్రిటరీ  అంటారు.  మూడవది ప్రభుత్వం. అంటే గవర్నమెంటు.    ఇప్పుడు చెప్పండి నేనెవరినో ?  ఎంటీ? ! మీ ఊరా ?  కాదు ! అవును మీ ఊర్లో ప్రజలున్నారు, మీకు భూమి ఉంది ఇంకా మీ ఉళ్ళో  ప్రభుత్వంలాగా పనిచేసే గ్రామ పంచాయితి కూడా ఉంది కాబట్టి నన్ను మీ ఊరు అనుకుంటున్నారేమో ?  కాదు. నాకు నాల్గవ లక్షణం కూడా ఉంది. అదే  సార్వభౌమాధికారం.  మీ ఉరికి ఆ లక్షణం లేదు.  అంటే సార్వభౌమాధికారం లేదు  అదేంటి  అనుకుంటున్నారా ? అవును  అదే ముఖ్యమైనది.  నాకుండే ఈ అధికారాన్ని, అదే సర్వబౌమదికారాన్ని  ఎవరూ ప్రశ్నించలేరు. నాపైన  మరో అధికారం లేదు. నేనే అన్నింటికంటే, అందరికంటే పెద్ద. నువ్వు మా రాష్ట్ర పతి  కంటే పెద్డా ? అని అడుగుతున్నారా ? అవును మీ రాష్ట్రపతి కంటే ఇంకా అమెరికా అధ్యక్షుడికంటే కూడా నేనే పెద్ద.  అంతా  కన్ఫ్యూజన్ గా ఉంది కదా .  డోంట్  వరీ! ఇంకో క్లూ ఇస్తాను.  ఒక్క సారి భారతదేశ పటాన్ని గుర్తుకు తెచ్చుకొండి.   అవును  నాపేరు రాజ్యం ఇప్పుడు నన్ను  దేశం అనీ జాతి అనీ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇంగ్లీషులో నన్ను స్టేట్ అని అంటారు.  నేనే  అమెరికాని.  నేనే భారత దేశాన్ని, నేనే ఆస్ట్రేలియాను, శ్రీలంకను, ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 195 పేర్లతో నన్ను  పిలుస్తారు.  ఇక్కడ దాదాపు అన్న మాట ఎందుకు వాడానంటే ఐక్య రాజ్యసమితి లిస్టులో ఈ రోజునాటికి 195 రాజ్యాల పేర్లున్నాయి. అందుకే  దాదాపు అన్న మాట వాడాను రేపు ఈ నంబర్ మారొచ్చు. తగ్గచ్చు పెరగొచ్చు.  ఓకేనా? సరే  ఇప్పటి వరకు చెప్పిన మరొసారి గుర్తు చేస్తాను.  


నన్ను రాజ్యం అని పిలుస్తారు.  ఇప్పుడు దేశం అనీ, జాతి అనీ రకరకాల పేర్లతో పిసుస్తున్నారు. తెలుగులో  రాజ్యం, ఇంగ్లీషులో స్టేట్  నా కామన్ పేర్లు , ప్రాంతాన్ని బట్టి నన్ను వేరే పేర్లతో పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, బంగ్లాదేశ్, చైనా. 

నాకు నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి 

  1. ప్రజలు People 

  2. ప్రభుత్వం Government

  3. ప్రదేశం Territory

  4. సార్వభౌమాధికారం   Sovereignty 




 ఇంకా నాగురించి చాలా  చెప్పాలి.   నా గురించి చాలా చెప్పాలి కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు !  సరే నా ఆత్మ కథను కూడా  సాంప్రదాయ పద్దతిలో క్లాస్ రూం  పాఠం లా మొదలు పెడితే మీరు బోరై పోతారు. అసలు విషయం ఇంకా మొదలే కాలేదా! మరి ఇప్పటిదాకా చెప్పుకున్నదేమిటన్న అనుమానం మీకు రావచ్చు. అది కూడా పరిచయమే కానీ మీ తో మాటలు కలపడానికి చేసిన ప్రయత్నం మాత్రమే.  అసలు పరిచయం ఇప్పుడు మొదలు పడతాను

 నన్ను రాజ్యం అన్న పేరుతొ పిలుస్తారు.  కానీ ఇప్పుడు ఆ పేరుతో నన్నెవరూ పిలవటంలేదు.  “దేశం” అని పిలుస్తున్నారు.  ఇంగ్లీషు లో స్టేట్ (State) అంటారు.  అయితే రాజ్యం లెదా స్టేట్  నా సాధారణ పెరు. అంటే అబ్బాయి, అమ్మాయి మనిషి, ఇవన్నీ కామన్ పేర్లు. ఎలాగంటే మీ క్లాసులో 10 అమ్మాయిలున్నారు అందులో ఫలానా అమ్మాయి పేరు సృజన లేదా మిథిలా, ఇలా పదిమందికి వేరు వేరు పేర్లు ఉంటాయి.   అలాగే  రాజ్యం  నా కామన్ పేరు.   అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ , జపాన్, చైనా, ఇండియా ఇలా అనేక పేర్లున్నాయి నాకు.   నేడు నేను లేకుండా  వ్యక్తి శాంతియుత సామాజిక జీవనం గడపడం అసాధ్యం. అసాంఘిక శక్తుల నుండి దౌర్జన్యాల నుండి, అమాయకులను, బలహీనులను రక్షించేది  నా ప్రభుత్వం. విదేశీ దాడులనుండి ప్రజలను కాపాడేది కుడా నా ప్రభుత్వమే.    ప్రభుత్వం నా ప్రతినిధి.  నాతరఫున ప్రజలను కాపాడుతూ వారికి చక్కటి  సామాజిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. చట్టాలు తయారు చేసి వాటిని అమలు పరుస్తుంది.  మీ దగ్గర పన్నులు వసూలు చేసి  ఆ డబ్బులను  మీకోసమే ఖర్చు చేస్తుంది  ప్రభుత్వం.  నేడు నేను మీ అంటే ప్రజల జీవితాలతొ ఎంతగా కలసి పోయానంటే నేను లేని జీవితాన్ని ఊహించడం కష్టం. అందుకే అరిస్టాటిల్ అంటాడు “రాజ్యంతో పనిలేని వ్యక్తి దేవుడైనా అయి వుండాలి లేదా జంతువైనా కావాలని.  భారతదేశం వంటి  పేద సంక్షేమ రాజ్యాలలో   నేను పేదలకు ఎన్నో రకాల సహాయం  అందిస్తాను. అందరూ ఏదో రకంగా నా నుంచి సహాయం పొందుతున్న వారే. అయితే నన్ను చెడుగా చూసే వారు కూడా ఉన్నారు.  అరాచక వాదులకు అంటే అనార్కిస్టులకు  నేనంటే ఇష్టం లెదు. అలాగే వ్యక్తిశ్రెయొవాదులు నా జోక్యాన్ని ఎక్కువగా  సహించరు. వారి  దృష్టిలో నేను అవసరమైన లేక   తప్పనిసరిగా ఉండవలసిన చెడును.  (State is an inevitable evil) వ్యక్తి శ్రేయో వాదులు లేసాపేర్ అన్న మాటను అప్పుడప్పుడు వాడుతుంటారు.   ఇంకా ఏమంటారంటే That government is the best government which governs least. అంటారు.      కార్ల్ మార్క్స్ ఏకంగా నేను  నాశనమై పోవాలని శపించాడు.  ప్రపంచీకరణం,  సరళీ కృత ఆర్ధిక విధానల ఫలితంగా  నా స్వరూప స్వభావాలలో మార్పులు వస్తున్నాయి. రాజ్యాల  బోర్డర్లు ఇక ఇలా  ఉండక పోవచ్చు. ఒకవైపు  కోవిడ్ అదేనండి కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టెసి చావు మేళం  జోరుగా వాయిస్తున్నఈ సమయంలో కొన్ని దేశాలు సరిహద్దుల వివాదాలు  మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు గర్జిస్తున్న ఈ సంకట తరుణంలో      నా  పరిచయం గురించి ఇంకా చాలా చెప్పొచ్చు.   కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను. 


నా పేరు లోని  మతలబు 


ఇంతకు ముందే చెప్పానుగా తెలుగులో నన్ను ‘రాజ్యం’ అంటారని. ఐతే ఒక్క విషయం. రాజ్యం అనే పేరు నా సాధారణ (కామన్)  పేరు. ఒక ఉమ్మడి పేరు కూడా.  దాదాపు 200 వందల నా లాంటి సోదర రాజ్యాల తరపున నేను ఈ  ఆత్మ కథను మీ ముందుంచుతున్నానని  అర్ధం చేసుకోవాలి.  ఈ రోజుల్లొ  రాజ్యం అన్న పదాన్ని ఎవ్వరూ వాడడం లేదు  ఇప్పుడు నన్ను దేశం, అనీ జాతి పిలుస్తున్నారు   రాజనీతి శాస్త్రవేత్తలు, ఇతర సమాజ శాస్త్ర వేత్త్తలు తమ పుస్తకాలలో, వ్వాసాలలో, ఉపన్యాసాలలో ఇంకా  నన్ను రాజ్యమనే సంభోదిస్తారు. హిందీలొ  నన్ను రాష్ట్రమని పిలుస్తారట. ఇక ఇంగ్లీషులో నన్ను స్టేట్ అంటారని కూడా చెప్పాను కదా!  కొంత మంది వ్యుత్పత్తి శాస్త్ర వేత్తలు అంటే ఎటిమాలజిస్టులు నా పేరు వెనక ఉన్న చరిత్ర గురంచి ఎం చెబుతున్నారో తెలుసుకుందాం. state (స్టేట్) అనే ఇంగ్లీష్ పదానికి మూలం స్టేటస్ ( STATUS) అనే పదం ఒకటి ఉందట.  ఈ స్టేటస్ అన్న పదం   ట్య్టుటానిక్ భాష నుండి వచ్చిందంటున్నారు.  స్టేట్ అన్న పదాన్ని మాఖీయవెల్లి అనే రచయిత  మొదటి సారిగా ‘ప్రిన్స్’ అన్న పుస్తకంలో వాడినట్లు చెపుతారు. ఈయన ఇటలీ దేశస్థుడట.  అదండి,  నా పేరు వెనక ఉన్న సంక్షిప్త  చరిత్ర.  







నా నిర్వచనాలు 

  కొంతమంది  శాస్త్రవేత్తలు  నన్ను అంటే రాజ్యాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారు.  అందులొ కొన్నింటిని చూద్దాం. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి.  ఏ నిర్వచనం కూడా నా గురంచి  పూర్తిగా చెప్పదు.  ముందుగా అరిస్టాటిల్ నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ఆయనెవరా?  అబ్బో! చాలా గొప్ప వ్యక్తి . రాజనీతి శాస్త్ర పితామహుడు. క్రీస్తు పూర్వం నాటి వ్యక్తి.  మన దేశం మీదకు దండెత్తిన గ్రీకు రాజు అలగ్జాండరుకు గురువు. 

ఈయనే అరిస్టాటిల్.   ఈయన  నన్ను ఇలా నిర్వచించాడు “మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి అతనికి ఉత్తమ జీవితం ప్రసాదించేదే రాజ్యం”      చూసారా? నా గురించి అరిస్టాటిల్  ఎంత బాగా చెప్పాడొ?  నేను మానవుని  అవసరాలు తీర్చడానికి పుట్టానట.  ఇంకా చక్కటి జీవితం ప్రసాదిస్తానట.  థాంక్యూ అరిస్టాటిల్!  నన్ను  పాజిటివ్ గా నిర్వచించినందుకు.      ఇప్పుడు  మరొకటి చూద్దాం.  


ఉడ్రోవిల్సన్ నిర్వచనాన్ని గమనిద్దాం 

    ఈయన కూడా చాలాగొప్ప వ్యక్తి.  ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు.  ప్రభుత్వ పాలన శాస్త పితామహుడు. నానా జాతి సమితి స్థాపకులలో  ఒకడు. గొప్ప తాత్వికుడు. ఈయన ప్రకారం రాజ్యం “ఒక నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన ప్రభుత్వం ఉన్న పౌర సముదాయము  విల్సన్ నిర్వచనంలో ప్రదేశం, ప్రజలు, ప్రభుత్వం,  శాసన బద్ధత అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈయన నిర్వచనం రాజ్య లక్షణాలను గుర్తు చేస్తుందని మీకు తర్వాత తెలుస్తుంది . 


అయితే డేవిడ్ ఈస్టన్, రాబర్ట్ ధాల్, గాబ్రియల్, ఆల్మండ్  వంటి రచయితలు నన్నొక రాజకీయ వ్యవస్థ గా పెర్కొన్నారు. ఇంకా వివరాలు కావాలంటే తెలుగు అకాడమి పుస్తకం చదవండి.   

 



నా పుట్టుక  

 

ఇప్పుడు కాసేపు నా పుట్టుక ముచ్చట చెప్తాను. అసలు నా పుట్టుక ఒక పెద్ద  మిస్టరీ.    ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు. నాకు డేట్ అఫ్ బర్త్ లెదు. మీరు అనుకుంటున్నట్లు  నేను ఒకే  ఎంటిటీని (?)  కాను.  నా సోదరులు చాలా మంది ఉన్నారు.   ఒక్క సారి ఐక్య రాజ్య సమితి సభ్యత్వ జాబితా చూడండి.  సుమారు 195 దేశాలు అంటే రాజ్యాలు అంటే నాలాంటి వాళ్ళు  ఉన్నారన్న మాట.  ఈ సంఖ్య కూడా ఖచ్చితమైంది కాదు.  ఇందులో ఎవరు ఎప్పుడు పుట్టారో చెప్పడం కష్టం.  అందుకే చెప్పాను నాకు డేట్ అఫ్ బర్త్ లేదు.  నాలాంటి రాజ్యాలకు చాలా వాటికి పుట్టిన రోజులు లెవు. అయితే కొంత మంది శాస్త్ర వేత్తలు నా జన్మ రహస్యాన్ని గురించి  కొన్ని ఊహా గానాలు చెసారు.  వాటిలో కొన్ని చెప్తాను.  


దైవ దత్త సిద్దాంతం 


దైవ దత్త సిద్దాంతం అంటే డివైన్ ఆరిజిన్ థియరీ  ప్రకారం దేవుడే నన్ను సృష్టిం చాడు. ఈ దైవదత్త సిద్దాంతాన్ని చాలా మంది  నమ్ముతారు.  మన పురాణాలలో  కూడా ఇదే రకమైన కథ  ఒకటి ఉంది. ఒకప్పుడు భూమి మీద అరాచకం ప్రబలిపోయి అంతా అల్లకల్లొలంగా ఉండేదట. ఆ బాధలు భరించలేక   కొంత మంది దేవుడి దగ్గరికి వెళ్లి తమ కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు దేవుడు  “మను” అనే వ్యక్తిని భూమి మీదకు పంపాడట.  అతనే  నన్ను సృష్టించాడనే వాదన ఒకటి ఉంది. రాజు దైవాంశ సంభూతుడనే నమ్మకం  ఒకప్పుడు బలంగా ఉండేది. ఇప్పటికీ కొన్ని మత తత్వ రాజ్యాలున్నాయి. ఉదాహరణకు.  ఇస్లామిక్ రాజ్యాలు. వెటకన్ సిటీ లాంటివి.  ఇవి రాజ్యాన్ని అంటే నన్ను  దేవుడే సృష్టించాడని ఇప్పటికి నమ్ముతాయి.  ప్రజలు, మత సూత్రాలనే ప్రభుత్వ శాసనాలుగా నమ్మి పాటిస్తారు . ఇలాంటి రాజ్యాలలో మతాన్ని కాపాడటమే నా ఏకైక లక్ష్యం.     అయితే  ఈ సిద్దాంతం నమ్మడానికి లేదని చాలామంది శాస్త్ర వేత్తలు  విమర్శించారు. దైవత్వభావననే నమ్మని నాస్తికులు  నన్ను దేవుడు సృష్టించాడంటే అస్సలు నమ్మశక్యం గా లేదని వారి వాదన. నానాటికి  సెక్యులరిజానికి ఆదరణ పెరుగుతున్నప్పటికీ  మతం నా వ్యవహారాలలో ఇంకా జోక్యం చేసుకుంటున్నది. మతానికి నాకూ  మధ్య యుద్ధం నేటిది కాదు.కొన్ని వేల సంవత్సరాలుగా నాకు మతానికి మధ్య తగాదా నడుస్తూనే ఉంది. అంతెందుకు ప్రస్తుతం కోరోనా మహమ్మారి మనుషుల్ని అప్పడాల్లా  నమిలేస్తున్నదన్న సంగతి మనందరికీ తెలుసు.  ప్రభుత్వాలు పండగలు ఇళ్ళల్లో చేసుకొమ్మంటే ఎవడైనా వింటున్నాడా? పైగా మా మతస్వేచ్చకు ప్రభుత్వం భంగం కలిగిస్తున్నదని  కోర్టులకు వెళ్లి పిటీషన్లు వేస్తున్నారు. బై ద వే సందర్భం వచ్చింది కాబట్టి చెపుతున్నాను నేను ప్రభుత్వం ఒకటి కాదు. ప్రభుత్వం దాని మూడు బ్రాంచీలు అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు నా తరఫున పనిచేసే నా సేవకులు మాత్రమే.  చాలా సార్లు నా అసిస్టెంట్ శాసన శాఖ చేసిన శాసనాలకు పోటీగా కుల మత సంఘాల కట్టుబాట్లు ముందుకు వస్తాయి.  అప్పుడు నాకూ మాతానికి దాదాపు యుద్ధమే జరుగుతుంది.  అయినా    మా లడాయి ఇప్పట్లో తెగేది కాదు.    సైన్సు ఇంకా అభివృద్ధి చెంది అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలిగిన నాడు మతం తప్పక మాయమవుతుందని నా నమ్మకం.   మతానికి నా   రక్షణ మాత్రమే అవసరం కాని నా పోషణ అవసరం లేదని సెక్యులరిస్టుల వాదన. లౌకిక రాజ్యానికి మతం ఉండదు.    అగస్టీన్, ఆక్వినాస్ వంటి  శాస్త్ర వేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంటే దైవదత్త సిద్ధాంతాన్ని   నమ్మిన వారిలొ ఉన్నారు. వాళ్లెవరు అంటారా?  నేను ఇన్ని విషయాలు మీతో ముచ్చటిస్తున్నానంటే అలాంటి శాస్త్ర వేత్త లే కారణం.  నన్ను సృష్టించింది ఎవరో నాకు తెలియదు కానీ నా గురంచి బాగా తెలిసినవారు మాత్రం శాస్త్రవేత్తలే. 

 


 దండనాధికార సిద్దాంతం  

ఇందులో  నేను అంటే రచయితగా చెప్పిన అభిప్రాయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తుందని అనుకుంటున్నాను.  దయచేసి ఈ పోస్ట్ ను ఫేస్ బుక్కర్లు /నెటిజన్లు  సీరియస్ గా చదవమని మనవి.  ఎందుకంటే ఇక ముందు జరగ బోయే చర్చ కు ఇది ప్రధాన భూమిక అవుతుంది. ఈ రాజ్యం ఆత్మ కథని ఎంత మందికి వీలయితే అంత మందికి షేర్ చేయండి.  ఈ అంశంపై చర్చ జరగడమే  నాకు కావలసింది    

బల ప్రయోగం ద్వారా రాజ్యాధికారం పుట్టిందని కొందరి అభిప్రాయం. బల హీనులను బలవంతులు లొంగదీసుకునే క్రమంలో రాజ్యం అంటే నేను జన్మించానని ఈ సిద్ధాంత సారాశం  యుద్దమే రాజ్యానికి  మూలమని ఒక సామెత ఉంది. రాజ్యం వీర భోజ్యమని  మహాభారతంలో భీముడు అంటాడు. బలమున్నోడిదే  రాజ్యమనే నానుడిని మీరు వినే ఉంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గుండాలదే రాజ్యం.     హెర్బర్ట్ స్పెన్సర్, హ్యూమ్, జెంక్స్ వంటి రచయితలు ఈ  సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వారు. నక్సలైట్లు “ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం” వస్తుందని ఇప్పటికీ నమ్ముతారు.  ఇస్లామిక్ స్టేట్ కోసం కొంత మంది చేసే ప్రయత్నం కుడా  దండనాధికార సిద్ధాంత కోవలోకే వస్తుంది. అన్నట్టు  దండనాధికార సిద్ధాంతాన్ని ఇంగ్లీషులో ఫోర్స్ థియరీ అనీ, కోయర్సివ్ థియరీ పిలుస్తారు. ఈనాటికి రాజ్యానికి సమాంతరంగా,  నిరంతరంగా  నేర సామ్రాజ్యం కొనసాగుతున్నది. కొన్ని సందర్బాలలో నేను ఇంత బలవంతుడనైనా, పొలీసు, మిలటరీ, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేర కూటములతొ జరిగే పోరాటంలో ఓడిపోతున్నాను.   నేను మీ నుంచి పన్నులు అంటే టాక్సులు వసూలు చేస్తే నేర సమాజాలు  “మామూళ్ళు” వసూలు చెస్తాయి. నాకు ఒక పద్దతి ఉంది. ప్రజల ఆమోదం ఉంది.  కానీ నేర సమాజానికి అవేమీ ఉండవు. షోలే అనే హిందీ సినిమాను మీరు చూసారా?  అందులొ గబ్బర్ సింగ్ అనే విలన్ ఉంటాడు.  పెద్ద గుండా. ఆయన ఒక డైలాగ్ కొడతాడు        “ మిమ్మల్ని (ప్రజలను) నానుంచి రక్షించ గలవాడిని నేనే. కాబట్టి మీ పండించిన పంటలో కొంత నాకు ఇవ్వాల్సిందే” అంటాడు.  కోర్టుల్లో అంటే న్యాయ స్థానాల్లో పరిష్కారం కాని అనేక సమస్యలు గుండాలు సెటిల్ చేస్తారు. కొన్ని ప్రాంతాలలొ నేను కల్పించలేని రక్షణను ప్రైవేటు గుండాలు కల్పిస్తారు. అక్కడ వాళ్ళ మాటే శాసనం.   ప్రజలు వారికి తమ సంపాదనలో కొంత సంతోషంగా సమర్పించుకొంటారు.   మరి దానికి పన్నుకు తేడా ఏముందండీ? 




సామాజిక ఒడంబడిక సిద్దాంతం 


ఇది మరో రకమైన సిద్దాంతం. ఇంగ్లీషు లో సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటారు.     రూసో, థామస్ హాబ్స్, హ్యూగో గ్రోషియస్ వంటి శాస్త్ర వేత్తల ప్రకారం  సమాజంలోని వ్యక్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న  ఒప్పందం ఫలితంగా నేను పుట్టినట్లు చెపుతారు. ఒకానొక సమయంలో కొంత మంది పెద్దమనుషులు కలిసి ఒక అధికార పూరిత వ్యవస్థ ను తయారుచేసుకున్నారని వారి అభిప్రాయం.  వ్యక్తులు తమ హక్కులను కొన్నింటిని త్యాగం చేసి వాటికి బదులుగా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని, రక్షణను  కొరుకుంటూ ఒక ఒప్పందాన్ని(కాంట్రాక్ట్)  కుదుర్చుకున్నారని సామాజిక ఒప్పంద వాదులు నమ్ముతారు. అలాంటి ఒప్పందం కారణంగా  నేను జన్మించి నట్లు చెపుతారు   ఈ సిద్దాంతం కూడా విమర్శకు గురైంది. ముఖ్యంగా ఒప్పంద సిద్ధాంతానికి చారిత్రిక ఆధారాలు లేవని విమర్శకుల అలక.  కానీ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టి పారెయలేము.  ఆచారాలు సంప్రదాయాలు శాసనాలకు మూలాలు. నేటికి ప్రపంచ వ్యాప్తంగా మారు మూల గ్రామాలలో నా ప్రభుత్వ శాసనాలకంటే అచార సాంప్రదాయాలే  బలంగా ఉంటాయి.  చదువు సంధ్యలు లేని గ్రామస్థులకు  రాజ్యాంగాల గురంచి, శాసన సభల గురంచి తెలియవు.   కానీ ఊరి ఆచారాలు, కుల కట్టుబాట్లే వారికి చట్టాలు, శాసనాలు.  నేటికి కూడా కొన్ని సమాజాలలో కుల మత కట్టుబాట్లు పార్లమెంటు, అసెంబ్లీ, ఇంకా గట్ట్టిగా మాట్లాడితే రాజ్యాంగాన్నికూడా  ధిక్కరించేలా ఉంటాయి. సతీ సహగమనం దురాచారాన్ని రూపుమాపడానికి ఆనాడు వలస వాద ప్రభుత్వానికి తోడు రాజారాం మోహన్ రాయ్ లాంటి సంఘ సేవకుల కృషి కూడా తోడైతే తప్ప దాన్ని ఆరికట్టలేక పోయాం.  నేటికి కూడా వరకట్న నిషేధ చట్టం అంటూ ఒకటి  ఉన్నా దాన్ని పూర్తిగా అమలు చేయలేక పోతున్నాయి నా  ప్రభుత్వాలు. ఈ సందర్బంగా నాకొక సంఘటన జ్ఞాపకం వస్తున్నది.  కొన్నేళ్ళ కింద ఒక ఊళ్ళో ఎదో పండగ సందర్భంగా  మొత్తం ఊరు ఊరంతా సామూహిక  పంక్తి భోజనాలు చేసుకున్నారు.  ఆ సమయంలో ఆ గ్రామ మాల మాదిగలను తమ పక్కన కూర్చుని భోజనం చేయడానికి ఆ ఊరి మిగతా కులస్తులు ఒప్పుకోలేదు ఈ విషయం అధికారుల ద్రుష్టికి వెళ్ళినా ఏమీ చేయలేక పోయారు. అంటరాని వ్యవస్థ  వ్యతిరేక చట్టం అక్కడ చేష్టలుడిగి అచేతనంగా ఉండిపోయింది.   రాజ్యాంగం, పోలీస్ వ్యవస్థ వారిని ఏమీ చేయ లేక పోయింది.  అమలు     ఆచార సంప్రదాయాలు ఆయా సమాజాల  ఒప్పందాలే.  కాబట్టి నా పుట్టుక తాలూకు రహస్యం సామాజిక ఒడంబడిక లో కూడా కొంత ఉంటే ఉండొచ్చు. 

నీళ్ల సిద్ధాంతం 


కార్ల్ విట్ ఫోగల్ అనే పెద్ద మనిషి  నీళ్ల సిద్ధంతాన్ని ముందుకు తెచ్చాడు.  ఆయన ప్రకారం మొదట్లో మనుషులు నొమాడిక్ అంటే సంచార జీవులుగా బతికే వారట.  అంటె  ఇల్లు, వాకిలి ఊరు, వాడ  ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. బహుశా కుటుంబ వ్యవస్థ కూడా ఉండేది కాదేమో.   జంతువులను వేటాడి, కాయలు దుంపలు   ఏది దొరికితే అది తినే వారు .  ఆ తర్వాత వ్యవసాయం మొదలయిందట. అప్పుడు మనుషులు సంచార జీవనం మానేసి ఒక చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్నార ని చెప్తాడు.  అలా చిన్న చిన్న ఊర్లు ఏర్పడి అవి కాస్తా పెద్దవయి పట్టణాలు, రాజ్యాలు గా మారాయని అంటాడు విట్ ఫోగల్. వ్యవసాయానికి కావలసింది నీళ్లు కాబట్టి నా పుట్టుకకు కారణం వాటరంటాడు విట్ ఫోగల్. ఇంగ్లీషులో నీళ్ల సిద్ధాంతాన్ని హైడ్రాలిక్ థియరీ గా పేర్కొంటారు. అవునండోయ్! ఈ సిద్దాంతంలో ఎక్కడో కొంత నిజం కనపడుతున్నది సుమా! పెద్ద పెద్ద పట్టణాలు, చాల దేశాల, రాష్ట్రాల రాజధానులు  ఏదో ఒక నది పక్కన ఉన్నాయి కదా!  ఉదాహరణకు లండన్ థేమ్స్ నది పక్కన ఉంది.  హైదరాబాద్ మూసీ నదికి అటూ ఇటూ ఉంది.  ఇంకా కావాలంటే ఇక్కడ్ ఇచ్చిన లింకును క్లిక్ చేయండి, మీకే తెలుస్తుంది.  అంటే నాగరికత నదుల నుంచే ప్రారంభమయ్యిందన్న మాట. ఈనాటికీ నా ప్రభుత్వాలు ప్రజలకు నీటి వసతిని కల్పిస్తున్నాయి. నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం నా బాధ్యత.    హిమాలయాలను  కరిగించైనా, అరేబియా సముద్రాన్ని మరిగించైనా జననానికి జలాలు ఇవ్వాల్సిందే!  అయినా  ఈ  సిద్ధాంతం కూడా పూర్తిగా వాస్తవం కాదని కొందరు విమర్శించారు.  విట ఫోగల్ చివరగా వాటర్ థియరీ ఇక్కడ నేను చెప్పినంత సరళంగా ఉండదు కానీ నేనే దాన్ని సింప్లిఫై చేసాను. ఎవరైనా ఈ విషయాన్నీ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి  లేదా ఈ వెబ్ సైట్ ను చూడండి https://www.jstor.org/stable/3630459?seq=1


ఇంతవరకు చెప్పుకున్న సిద్దాంతాలన్నీ నాకు ఖచ్చితమైన పుట్టిన తేది, తిథి, వార నక్షత్రాలు  లేక పోవడం వల్ల  వచ్చిన  హైపొథీసీసులు తప్ప  ఎ ఒక్కటీ పూర్తిగా నిజం కాదు.  1947 లో ఏర్పడిన పాకిస్తాన్, ఇజ్రాయిల్   మతం, సోషల్ కాంట్రాక్ట్ , ఇంకా బలప్రయోగ సిద్దాంతాల కలయికగా  పేర్కొన వచ్చా?!  ఏమో కావచ్చు! Else it is  not real birth of a state but  mere transfer of political power.   ఇక భవిష్యత్తులో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడితే  మతం, బలప్రయోగం, దైవ దత్త అధికార వ్యవస్థ, సామాజిక ఒడం బడిక  అన్నీ అందులొ కనపడతాయి కావచ్చు. సరే చివరగా చెప్పుకొవలసిందేమిటంటే నాకు జన్మ తేదీ  లేదు.  మీకులాగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే అదృష్టం లెదు.     


నా మట్టుకు నాకు ఏమనిపిస్తుందంటే  మనుషులు పుట్టకముందే రాజ్యం అంటే నేను,  పుట్టాననిపిస్తుంది . అదెలాగంటే  డార్విన్ చెప్పిన జీవ పరిణామ సిద్ధంతాన్ని మీరు నమ్మితే,  మనిషి మనిషిగా మారక ముందు కోతి గా ఉండేవాడని తెలుసుగదా?.   కాబట్టి అన్ని  జంతువులు మీ కంటే   ముందే పుట్టి ఉంటాయి గదా?.  ఆ లెక్కన చీమలు, తేనెటీగలు మనుషుల కంటే ముందు పుట్టి ఉంటాయి కదా?  మరి  అవి  చక్కటి శాసన బద్ధ మైన జీవితాన్నిఈ నాటికి కలిగి ఉన్నాయి. భారత దేశంలో, ఆఫ్రికా ఖండంలోని   వందల గ్రామాలు  రాజ్యం, దాని ఉనికి  తాలూకు స్పర్శ  లేకుండా శాంతి యుత జీవితాన్ని  గడుపుతున్నాయి.     చీమలకు రాణి చీమ ఉంటుందట.  అది చెప్పిన మాట మిగతా చీమలు వింటాయట.  ఆప్టరాల్  స్టేట్ మీన్స్ ఎ సిస్టమాటిక్ లైఫ్. రాజ్యం అంటే  ఒక క్రమ బద్ధ జీవితమే అనుకుంటే మనిషి పుట్టకముందే క్రమ బద్ధ మైన సామాజిక జీవనం ఉండేది. కాబట్టి మనిషి కంటే ముందే రాజ్యం అంటె నేను  పుట్టాను. ఆ నాటి రాజ్యానికి నేటి సమాజానికి పోలికలు మొత్తంగా లేక పోవచ్చు.   సో మై డియర్  సిటిజన్స్,  నా పుట్టుక ఇప్పటికీ, బహుశా  ఎప్పటికీ ఒక మిస్టరీయే!

ఈ సందర్భంగా రీడర్స్ కు నా విన్నపం. ఎలాగూ నా జన్మ రహస్యాన్ని ఛేదించడం సాధ్యంగాదు. ఇప్పుడు అటాప్సీ అదేనండీ పోస్టుమార్టమ్ , శవ పరీక్ష బదులు బయాప్సీ చేస్తే ఎలా ఉంటుందో ఆలొచించండి        “ పన్నుఅంటే Tax  పుట్టినపుడే నేను పుట్టానని నా అభిప్రాయం.   నాకు  పన్ను కు చాలా దగ్గర సంబంధముంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన అన్ని రకాల హైపోథిటికల్ సిద్ధాంతాలలో పన్ను ప్రస్థావన కనిపించదు కనిపించినా దాన్ని సీరియస్ గా అధ్యయనం చేసిన దాఖలాలు లేవు . కానీ  పన్ను అంటే Tax లేకుండా ఏ రాజ్యం మన లెదు.   బలవంతంగా ఒక లెక్కా పత్రం లేకుండా వసూలు చేసేది “ మామూలు”.  అదే న్యాయ బద్దంగా వసూలు చేస్తే పన్ను అవుతుంది.  ఈ నాటికి కొన్ని రకాల వసూళ్ళు న్యాయ బద్ధత లేకుండా జబర్దస్తీగా  కొనసాగుతున్నాయి. మామూళ్లు ఎప్పుడు పన్ను రూపం అంటే లేజిటిమైజ్ అయిందో ఆ రోజే నా డేట్ అఫ్ బర్త్. కాని మామూలు ఎప్పుడు న్యాయ బద్దత పొందిందో చెప్పడం కష్టం.  కాబట్టి పన్నును సెంట్రల్ పాయింట్ గా ఊహించుకొని      Pre Tax State, Post Tax State గా నన్ను విశ్లేషి స్తే నా పుట్టుక రహస్యాన్ని కొంత వరకైనా చేధించ వచ్చు.  పైగా ఇప్పటికీ నేరాలు, అవినీతి ఎక్కువగా ఉండి డబ్బుల రాక పోకల తీరును బట్టి ఏయే రాజ్యాలు ప్రీ టాక్స్ దశలో ఉన్నాయో ఏవి పోస్ట్ టాక్స్ దశలో ఉన్నాయో చెప్పొచ్చు. అంటే ఫలానా రాజ్యంలో డబ్బులు లీగల్ గా కంటే ఇల్లీగల్ గా చలామణి ఎక్కువగా ఉందంటే అది ప్రీ టాక్స్ రాజ్యం అనుకోవాలి బ్లాక్ మనీ తగ్గి వైట్ మనీ పెరిగితే అది పోస్ట్ టాక్స్ స్టేట్గా భావించాలి. ఇది ఖచ్చింతగా నా అభిప్రాయం  మాత్రమే. దీనిపై వాదోపవాదాలు విమర్శ ప్రతి విమర్శలు జరుగుతాయని నాకు తెలుసు. నాకు కావలిసింది కూడా అదే.   ఇక ఇప్పటికి నా పుట్టుక సోది  ఆపేసి కాస్త ముందుకెళ్ళే పనిలో పడదాం.  

    

  ఇప్పుడు నా లక్షణాల గురించి తెలుసుకుందాం.  ప్రధానంగా నాకు నాలుగు ముఖ్య లక్షణాలున్నాయని ఇంతకుముందే చెప్పాను  కదండీ! జ్ఞాపకం లేదా?!  సర్లెండి! నేను చెప్పడం మీరు మర్చిపోవడం… ఎప్పుడూ ఉండేదే కదా? మళ్లీ చెప్తాను. తప్పుతుందా!   నాకు నాలుగు ముఖ్య లక్షణాలున్నాయి. అవి 


  1. ప్రజలు People 

  2. ప్రదేశం Territory 

  3. ప్రభుత్వం           Government

  4. సార్వభౌమాధికారం    Sovereignty


ఇప్పుడు ఒక్కొక్క  లక్షణం గురించి కొంచం వివరంగా తెల్సుకుందాం. 


ప్రజలు 

ప్రజల గురించి ఏముంటుంది తెలుసుకోవడానికి అనుకుంటున్నారా? అబ్బో ! చాలానే ఉంది. 

దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్  అన్నాడో మహాకవి.  ఆయన పేరూ….  గుర్తుకొచ్చింది. గురజాడ గారు. ఆయనెవరా? ఆయనే నండి.. కన్యా శుల్కం. ముత్యాలసరాలు వంటి  కావ్యాలను సృష్టించిన గొప్ప కవి.  ఆయన గురించి ఇంకా తెల్సుకొవాలంటె, మీరు నా  ఈ  ఆత్మ కథను  ఆన్ లైన్లో చదువుతున్నట్లయితే,  ఇక్కడ క్లిక్ చేయండి.     కాబట్టి మై డియర్ పౌరులారా! రాజ్యం అంటే మీరే.  అంటే ప్రజలే. అయితే ఎంత మంది  (ప్రజలు) ఉండాలి? ఏదైనా ఖచ్చితమైన సంఖ్య ఉందా అంటే లేదనే చెప్పాలి.  వందల్లో,  వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో లేదా చైనా, ఇండియా లలో  లాగా 100 కోట్ల కు మించి ఉండొచ్చు.  వాటికన్ సిటీ (ఇది కూడా ఒక రాజ్యమే) జనాభా 900 లోపు మాత్రమే.  ఎంత మంది ఉన్నారన్నది మ్యాటర్ కాదు. ఎంత మంచి వారు, ఎంత గొప్ప పనిమంతులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, నీతిమంతులు ఉన్నారన్నది పాయింట్.  దోపిడీలతొ, మోసాలతో, వంచనలతో, అనారోగ్యాలతొ, చేతగాని సోమరిపోతులుగా  ఉండే కోట్ల జనాభా కంటే తక్కువ ఉన్నప్పటికీ మంచి వారుంటే చాలు. దేశమంటే మట్టి కాదోయ్ … దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారే,  ఈసురో మని దేశ ప్రజలుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని కూడా అన్నాడు. మహానుభావుడు మరణించి వందేళ్లయినా(1915) ఇప్పటికీ  జనం మనసుల్లో బతికే వున్నడు. శ్రీ శ్రీ అన్నట్లు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు.  అలా కాకుండా పావన నవ యవ్వన యువకులు, ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే వారు మనకు కావాలి. సో ఎంత మంది అంటే .. నో స్పెసిఫిక్ స్కేల్. నో ఫిక్స్డ్ నంబర్. మీకు రాజ్యాలు, వాటి జనాభా లెక్కలు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.  అయితే కొంతమంది శాస్త్రవేత్తలు జనాభా సంఖ్యలను సూచించారు.  ప్లాటో 5040 మంది ని ఒక ఆదర్శ రాజ్య జనాభా గా పేర్కొంటాడు.  అలాగే రూసో 10,000 జనాభా ఉంటే సరిపొతుందన్నాడు.  వాళ్ల కాలం నాటికి ఆ లెక్కలు సరిపోయాయేమో గానీ ఇప్పుడు అలా ఖచ్చితమైన సంఖ్య సూచించడం  వీలుకాదు. ఒకప్పుడు భారత దేశ పేదరికానికి అధిక జనాభా కారణమన్నారు. కానీ నేడు ఆ అధిక జనాభా నే మనకు వరంగా మారింది. కానీ నిరక్షరాస్యులు, బద్దకస్తులు, ఎలాంటి స్కిల్స్ లేని వారు ఉన్నా లేకపోయినా ఒకటే.  దీన్ని బట్టి మనకు అర్ధమౌతున్నదేమిటంటే జనాభా కు ఖచ్చితమైన సంఖ్య లేక పోవడం మాత్రమె కాదు. జనాభా సంఖ్యలో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయని.   అదండీ ప్రజల గురించిన వివరణ !  మరి రెండో లక్షణానికి షిఫ్ట్ అవుదామా? 



ప్రదేశం


“నా జన్మ భూమి ఎంతో అందమైన ప్రదేశం”  అని ఎవరో ఒక కవి రాస్తే ఒక గాయకుడు బహుశా ఘంటసాల గారనుకుంటాను  దాన్ని చక్కగా రాగయుక్తంగా ఆలపించాడు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న పద్యం వింటే ఒళ్లు పులకరించి పోతుంది.    దేశమంటే మట్టికాదోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్నారు గాని రాజ్యమంటే మట్టి కూడా. పంటలు పండాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, చివరికి మనం నిలబడాలన్నా భూమి కావలసిందే కదా? మనిషి గాలిలో బతక లేడు, నీళ్లపై నిలపడలేడు   గదా? అందుకని నా రెండో లక్షణం ప్రదేశం లేదా భూమి.  ఇంగ్లీషు లో అయితే దీన్నే ప్లేస్ అని టెర్రిటరీ  పిలుస్తారు. అయితే ఎంత జాగా అవసరము?  ఈ ప్రశ్నకు జవాబు కూడా -‘నో లిమిట్’. కనిష్ట,  గరిష్ట  పరిమితులు లేవు. అతి చిన్న దేశాలున్నాయి అతి పెద్ద దేశాలున్నాయి ప్రపంచంలొ అతి పెద్ద రాజ్యం  రష్యా- 1,70,75,200 చదరపు కిలో మీటర్లు.  వాటికన్ నగరం కేవలం 0.44 చదరపు కిలో మీటర్(ఒక చదరపు కిలోమీటరు కంటే తక్కువ)  మాత్రమే.  వైశాల్యం లో భారత దేశం 7 వ స్థానంలో ఉంది.  రాజ్యం తన ప్రజల అవసరాలను తీరుస్తూ వారికి సుఖ సంతొషాలను పంచి ఇవ్వాలి.  అప్పుడే నన్ను అందరూ మెచ్చు కుంటారు.  ఉత్తర దక్షిణ ధృవాలలో నేను ఉండ లేను.  ఎందు కంటే  మీరు ఉండ లేరు కాబట్టి.  ప్రదేశాల కోసమే జనం కొట్టుకు చస్తున్నారు. చరిత్ర లో జరిగిన అనేక యుద్ధాలు భూమి కోసమే కదా!  అయితే ఒక రాజ్యం పైన ఉండే ఆకాశం సంగతేంటి?  ఆ ఆకాశమంతా ఆ రాజ్యానిదే.  దీన్నే ప్రాదేశిక వియత్తలం అంటారు. ఇంగ్లీషు లో అయితే టెర్రిటొరియల్ స్పేస్ అంటారండి. అలాగే ఒక రాజ్యం సముద్రాన్ని అనుకుని ఉంటే, మరి  ఆ సముద్ర జలాలు ఎంతవరకు ఆ రాజ్యానికి చెందుతాయంటే..  200 నాటికల్  మైళ్ల వరకు. ప్రదేశం సైజును బట్టి నా అంతర్గత అరేంజ్మ్ంట్ లో కొన్ని మార్పులుంటాయి.  చిన్న చిన్న రాజ్యాలకు ఏకకేంద్ర తరహా ప్రభుత్వాలుంటాయి. పెద్ద  సైజు రాజ్యాలకు సమాఖ్య లక్షణాలుగల ప్రభుత్వాలు  వుంటాయి   ముందు ముందు ప్రదేశం ఇంకా అనేక సమస్యలు తెచ్చి పెడుతుందని నా భయం.  జనాభా పెరుగుతున్నది.  కానీ భూమి పెరగదు. ప్రజలకు కూడు, గూడు లేక పొతే మళ్లీ మొదటి రోజులు వస్తాయేమో. నా నీడన చల్లగా బతుకుతున్న ప్రజలు అరాచకాలకు తెగబడతారేమో!  అప్పుడు నా ఉనికే ప్రమాదంలో పడుతుంది.  ముందే భూ గ్రహం మీద భూమి తక్కువ నీళ్లెక్కువ.  గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని సముద్ర మట్టాలు పెరిగిపోయి మిగిలిన ఆ కాస్తా భూమి నీళ్ల పాలయితే అప్పుడు ప్రజలు పడవల్లో కాపురముండాలి. అప్పుడు  సన్న బియ్యపు అన్నం బదులుగా ఉత్త  చేపలనే తిని బతకాలి.  కొంపదీసి  కార్ల్ మార్క్స్ నేను  నాశనమై పోవాలని పెట్టిన శాపం నిజమవుతుందో, పాడో! . అయినా కార్ల్ మార్క్స్ నేను అంటే  రాజ్యాన్ని  చచ్చి  పోవాలని కోరుకున్నాడు గానీ ప్రజలు అంతమై పోవాలని ఆశించలేదు సుమా! ఆయనకు నేనంటే కోపం గానీ ప్రజలంటే ఇష్టమే. భూమి మీద జాగా తగ్గిపొయినందువల్లె  కాబోలు కొందరు   ఇతర గ్రహాల పైన    వెతుక్కుంటున్నారు.  ఉన్నదాన్ని కాపాడుకోలేని వాడు అక్కడికెళ్ళి మాత్రం ఎం వెలగ బెడతాడో!  సరే భవిష్యత్తును ఖచ్చితంగా ఊహించడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి ప్రదేశం తాలూకు చర్చ ను ఇక్కడ వదలి మరో లక్షణం-  అంటే ప్రభుత్వం కేసి చూద్దాం. 



ప్రభుత్వం 


నిజానికి సామాన్య వ్యక్తి  నన్నూ , ప్రభుత్వాన్ని ఒకటే గానే ఊహించుకుంటారు.  కాని ప్రభుత్వం  నా తరఫున పనిచేసే ఒక ఏజెంట్ మాత్రమే. నేను శాశ్వతంగా ఉంటాను.  ప్రభుత్వాలు మారిపోతాయి.  ప్రపంచ వ్యాప్తంగా రాజ్య లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి.  కానీ ప్రభుత్వం అలా కాదు. రకరకాల ప్రభుత్వాలున్నాయి.   పార్లమెంటరీ ప్రభుత్వ మనీ, అధ్యక్ష తరహ, రాజరిక ప్రభుత్వమనీ రక రకాల ప్రభుత్వాలు న్నాయి. కానీ నా బాడ్ లక్  ఏంటంటే ప్రభుత్వ పనితీరు పైనే నా మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి.  నేను మంచి రాజ్యాన్నా కాదా అన్న  విషయం ప్రభుత్వం పనితీరు  తేలుస్తుంది.  కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తాయి. అంటే నిర్ణిత కాల వ్యవధిలో ఎన్నికలుంటాయి.  ప్రజలు తమకు  నచ్చిన వారికి నిర్ణిత కాలం కోసం అధికారాన్ని అప్పగిస్తారు.  బాగా పనిచేస్తే మళ్లీ ఛాన్స్ వస్తుంది.  లేకుంటే ఇంతే సంగతులు,  ఇంటి దారే గతి. కొన్ని దేశాల్లో నిరంకుశ  ప్రభుత్వాలుంటాయి.  మరికొన్ని రాజ్యాలలో పైకి ప్రజాస్వామ్య ప్రభుత్వంలా కనిపించినప్పటికీ, అంతర్గతంగా సైన్యం ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.  సైన్యం నడిపిన ప్రభుత్వం ఏదీ కూడా ప్రజల ఆమోదం  పొందిన దాఖలా చరిత్రలో లేదు. సాధారణం గా  ప్రభుత్వంలొ మూడు భాగాలు లేక అంగాలుంటాయి.  1. శాసన శాఖ  2. కార్య నిర్వాహక శాఖ  3. న్యాయ శాఖ.  శాసన శాఖ శాసనాలు తయారు చేస్తుంది.  కార్య నిర్వాహక శాఖ వాటిని అమలు పరుస్తుంది.  ఇక   ఈ రెండు   శాఖలు అంటే శాసన,   కార్య నిర్వాహక   శాఖలు     ఎప్పుడైనా ఎక్స్ ట్రాలు చేస్త్తే  న్యాయశాఖ కల్పించుకొని న్యాయం చేస్తుంది. సరే న్యాయ శాఖ  హద్దుమీరితే దాన్ని కుడా  కట్టడి చెసే పద్ధతులున్నాయనుకోండి.  మొత్తం మీద అధికార బాధ్యతలను సమతౌల్యం చేసుకుంటూ ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ఏదీ అనుకున్నంత ఈజీ గా ఉండదు కదా! అన్ని వ్యవస్థలు సరిగా పని చెస్తే ఇక సమస్యే లేదు కదా?   సరే ప్రస్తుతానికి ప్రభుత్వం, దాని మూడు అంగాల కబుర్లను కాసేపు పక్కన బెట్టి చివరి లక్షణం - సార్వభౌమాధికారం సంగతి చూద్దాం.

     

సార్వభౌమాధికారం    Sovereignty


ఇంతకు ముందు చెప్పిన లక్షణాలకు ఎంతొ కొంత భౌతిక విజిబిలిటీ ఉంది కాని సార్వభౌమాధికారానికి అలాంటి లక్షణం లెదు. కరంటు తీగ కనపడుతుంది కానీ కరంటు కనపడదు.  కనపడటంలేదని తీగను ముట్టుకుంటే షాక్ కొట్టినట్లే సార్వభౌమాధికారాన్ని కదిపితే కూడా షాక్ కొడుతుంది సుమా! జాగ్రత్త ! ప్రజలు, ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, మంత్రులు, అధికారులు, అన్ని సంస్థలు నా అధికారాన్ని అంగీకరించాల్సిందే. సార్వభోమాదికారానికి కొన్ని లక్షణాలున్నాయి. వాటిని గురించి చర్చించుకుందాం. అంతకంటే ముందు ఏదైనా ఒక నిర్వచనాన్ని చూద్దాం. 


   

ఇంగ్లీష్  నిర్వచనం 

 “That characteristic of the state by virtue  of which it cannot be legally bound except by its own or limited by any power other than itself. -Jellineck

పై నిర్వచనం ఎం చెబుతున్నదంటే  తనకు తానుగా ఏర్పరుచుకున్న న్యాయ పరమైన పరిమితులకు తప్ప మరే ఇతర అధికారానికి లొంగని రాజ్య లక్షణం .  ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి జేల్లినేక్.  ఇంకా ఇలాంటి నిర్వచనాలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి 



లక్షణాలు 

  1.  శాశ్వతత్వం: నా అధికారం శాశ్వతమైంది.  అది నాతోనే ఎప్పుడూ  ఉంటుంది

  2. అవిభాజ్యం :             నా సార్వభౌమాధికారాన్ని విభజించ లేము 

  3. నిరపేక్షమైనది : సార్వభౌమాధికారాన్ని పోలిన మరొక అధికారం ఎక్కడా ఉండదు. 

  4. అనన్యసంక్రామకము:  ఈ అధికారాన్ని మరొకరికి బదిలీ చేయలేము. 

ఇలా నా లక్షణమైన సార్వభౌమాదికారానికి కూడా కొన్ని లక్ష్నాలున్నాయి. ఇప్పుడైనా అర్ధమైందా నా గొప్ప తనం 


కాబట్టి నా ప్రియమైన ప్రజలారా నా గురించి ఇంకా తెలుసుకోండి.  మీ జీవితాలను ఇంకా సుఖమయం చేసుకోవడానికి నన్నూ, నా పనితీరును మార్చుకొండి మీరు చైతన్య వంతులైతే తప్ప ఇది సాద్య్హం కాదు మీరు అంటే ప్రజలు లేని నేను మానవ మాత్రుడు లేని ఎడారినో లేక మంచుతో నిండిన ఉత్తర దక్షిణ ద్రువాలో అవుతాను.   నా పరిణామ దశలగురించి మరోసారి మాట్లాడుకుందాం ఇప్పటికి సెలవు. 


ఇట్లు 

మీ 

         రాజ్యం






రచయిత 

ప్రదీప్ కుమార్, రిటైర్డ్ లెక్చరర్.  

నిజామాబాద్ 

9849609959

jayadeep.kulkarni@gmail.com


రచయితగా నా మాట : కళా రూపాలను విద్య కోసం ఉపయోగించుకునే ప్రయత్నం లో భాగంగా ఈ రాజ్యం ఆత్మ కథ ను రాయడం జరిగింది. నేను ఎన్నుకున్న విధానం,  ఇందులో చెప్పిన అంశాలు (కొత్తగా జొడించినవి కూడా ) మేధావుల విమర్శలకు అతీతమైనవి కావు. అక్షర దోషాలను మరీ భూతద్దంలొ చూడొద్దని మనవి.  చర్చకోసం ఎదిరిచూస్తూ శలవు 


రచయిత