పేజీలు

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

 

మార్క్సిజం భౌతిక వాదం – మనషి భావాలు

19-09-2020 రోజున  వాట్సాప్ లో   అహ్మద్ ఫార్వార్డ్ చేసిన వ్యాసాన్ని చదివిన తర్వాతా  ఇది రాయాలనిపించింది. వ్యాస కర్త  పేరు బయట పెట్టడం అనవసరం అనిపించిది.  స్థూలంగా ఆ రచయిత్రి గారు చెప్పింది :  మానవ సమాజం పుట్టిన తర్వాతే దోపిడీ వ్యవస్థ పుట్టింది.  అంతకు ముందు దోపిడీ ఉండేది కాదు.  ఆ రచయత్రి గారు ఇంకా చాలా విషయాల గురించి ప్రస్తావించారు కానీ నేను ఇక్కడ వాటిని విశ్లేషించే ప్రయత్నం చేయలేదు.  ఇంతకీ అహ్మద్ ఎవరూ?  నా చిరకాల మిత్రుడు. సమాజాన్ని గురించి ఒక లోతైన అవగాహనతో  ఆలోచించ  గల  మేధావి అంతకు మించి ఒక క్రిటిక్ . ఈ కాంటెక్స్ట్ లో ఆయన గురించి ఇంతకంటే పరిచయం అవసరం లేదని నా అభిప్రాయం. మరో సందర్భంలో ఆయన గురించి తెల్సుకుందాం.  

వడ్డీ వ్యాపారం గురంచి రాసిన  ఆ వ్యాసం మొదటి పేరాగ్రాఫ్లో  రచయిత్రి గారు  వేల వేల సంవత్సరాల వెనిక్కి వెళ్ళి మనవ పరిణామ క్రమాన్ని ప్రస్తావించారు. కానీ అందులో కూడా నాకు మతం తాలూకు ట్రేసెస్ కనిపించాయి.  ఎందుకంటే దాదాపు  అన్ని మతాలు  మనిషిని ఆల్ ఆఫ్ సడన్గా   దేవుడు సృష్టిందాడనే ఒక అశాస్త్రీయ పునాది తోనే తమ సూడో  ప్రపంచాలను  ఫ్యాబ్రికేట్ చేయడం  మొదలు పెడతాయి. ఇక్కడ రచయిత్రి  గారు కూడా అదే పని చేసారు. “మిగులు” ను దోపిడీ చేయడం మనిషి మాత్రమే చేస్తాడనే ఒక బేసిక్ హైపోతిటికల్ కాన్సెప్ట్ తో ఉన్నట్లు అనిపించింది  కానీ  అసలు మిగులు కంటే ముందు కూడా దోపిడీ ఉండేదని నా అభిప్రాయం (subject to strict scrutiny and criticism) బలవంతుల దౌర్జన్యాలు మోసాలు, కుట్రలు కుతంత్రాలు  మిగులు దోపిడీ  కు ముందు రూపాలు. అవి ఇప్పటికీ ఉన్నాయనుకోండి.  కానీ మిగులు దోపిడీకి  కు తాత ముత్తాతలు దౌర్జన్యాలు.  దౌర్జన్యం అనేది బహురూప ప్రక్రియ అందుకే  దౌర్జన్యా-లు అని వాడాను ఇక్కడ.  మిగులు దోపిడీకి  మెటామార్ఫ్ అయ్యే లక్షణం ఉంది. అది తన రూపు మార్చు కొన్న ప్రతీ సారీ  దోపిడీ రూపాలు కూడా  మారతున్నాయి. ఇప్పుడు అన్ లైన్ డిజిటల్ ద్రవ్య మార్పిడి మొదలయిన తర్వాతే ప్రపంచ కుబేరుల ఆస్థుల పెరుగుదల రేటు (గ్రోత్ రేట్)  మరింత ఎక్కువయింది. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ లు ఈ కోవలోకే వస్తాయి.  ఒకప్పుడు ఒక చేపకు స్వార్ధం పెరిగో లేక  ఒక అనివార్య దశలోనో లేక  అనుకోకుండా ఆహారం అధికంగా దొరికినందువల్లో లేక ఇతర చేపలను బెదిరించో   కారణం ఏదైనా మిగతా చేపల కంటే కొంచం బలంగా తయారయింది.  అక్కడే డార్విన్ చెప్పిన జనరేషన్ చేంజ్ లేక షిప్ట్  మొదలయింది. అంటే డార్విన్ చెప్పిన అనేక విషయాలలో ఇదొక చిన్న అంశం మాత్రమే. అంతేగానీ డార్విన్ పై ఇది  ఏక వాక్య  కంక్లూజివ్ కామెంట్ కాదు.   ఆ తర్వాత  ఆ చేప తన స్వజాతి చేపలనే తినడం మొదలు పెట్టింది   ఆ చేపే తిమింగలంగానో   సొర చేపగానో తర్వాతి కాలంలో రూపాంతరం చెంది ఉండాలి. ఇది జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిండుడాలి. డైనోసార్లు ఇంకా  అనేక జీవరాసులు అలా తమ ఆకారాలను పెంచుకున్నాయి. ఎందుకంటే అప్పట్లో మిగులు కేవలం ఆహారం రూపంలో మాత్రమే ఉండేది. దాన్ని దాచుకోవడానికి వాటికి గాదెలు గోదాములు  బ్యాంకులు, లాకర్లు  లేవు కాబట్టి తమ శరీరాలనే గాదేలుగా లేక బ్యాంకులుగా వాడుకున్నాయి. అందుకే వాటి ఆకారాలు అలా పెరిగిపోయాయి,  గద్ద తన ఇతర చిన్న పక్షి జాతులను పలహారం చేస్తే, పాములు తన దాయాది సరీసృపాలను తింటుంది.  ఇప్పటిదాకా చెప్పుకున్న సంగతి సారాంశం,  మిగులు దోపిడీ కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు పైగా ఇది టైం టు టైం  మెటామార్ఫసిస్ కు లోనవుతుంది. ఆ డైనమిక్స్ ను కూడా అర్ధం చేసుకుంటే తప్ప దాన్ని నివారిచండం సాధ్యం కాకపోవచ్చు.

     మార్పు మనిషి నుంచే మొదలు కావాలని గాంధీ లాంటి వాళ్ళు వాదిస్తే సమాజం నుంచి మొదలు పెట్టాలని మార్క్స్ లాంటి వారు  వాదించారు. కానీ రెండూ ఫేలయ్యాయి. శ్రామికులకు రాజ్యాధికారం వస్తే మనిషి మారతాడన్నప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోయింది. ఇక కుటుంబం,  మతం, కులం కుటుంబం చివరికి రాజ్యం సైతం మనిషిని కంట్రోల్ చేయలేక పోతున్నాయి.

ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది.  మార్క్స్ భౌతిక వాదం ప్రీ హిస్టారిక్ ప్రిమిటివ్ సమాజం నుండి ఫ్యూచర్ సోషలిస్ట్ సమాజ నిర్మాణం వరకూ వెళ్లి  మనిషి దగ్గరికి రాగానే ఎందుకు ఆగిపోయింది?  మనిషిని పూర్తి పాజిటివ్ గా చూసి లోప రహితుడిగా,  దోష రహితుడుగా    అంటే శ్రామిక వర్గం తాలూకు (at least Proletariat human being) మనిషిని  మంచి   వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది. చిన్న పిల్లలు సైతం తోటి పిల్లల ఆట వస్తువులు, తినే వస్త్తువులు లాక్కునే ప్రయత్నం చేస్తారు. అంతేగాక వాళ్ళలో కూడా అవినీతి లక్షణాలు కనపడతాయి. మన మాట వినని పిల్లలకు చాక్లెట్  లంచం ఎరచూపుతాము.  అలాగని వాళ్ళని తప్పు పట్టే ఉదేశ్యం లేదు. మొత్తంగా ఇక్కడ చెప్పదలుచు కున్న విషయం ఏమిటంటే మనలో  అంటే ప్రతీ వ్యక్తిలో ఎక్కడో దోపిడీ మూలాలు దాగున్నాయి. ఆ మూలాలను రాజ్యంలోనో,  సమాజంలోనో, కుటుంబం లోనో ఉన్నాయనుకుని చికిత్స చేసే పనిలో ఉన్నాము.  చేతికి దెబ్బ తగిలితే కాలికి కట్టు కడుతున్నామేమో ఆలోచించాలి.  

     మనిషిలో కనిపించే అనేక భావోద్రేకాలు మన చుట్టూ ఉండే  సామాజిక, ఆర్ధిక,  భౌతిక అంశాలపై తోసేసి మన తప్పేమీ లేదని  చేతులు దులుపు కుంటున్నాము.  కానీ అవి బయట లేవని మనలోనే ఉన్నాయని తెలుసుకోలేక పోతున్నాము.  ఈ ప్రయత్నం కొన్ని వేల సంవత్సారాల క్రితమే మొదలయ్యిందని మీరు అనుకోవచ్చు.  దేవుడు, మతం, భక్తీ,  మనషి ఆత్మను ప్రక్షాళనం చేసే ప్రయత్నం చేస్తాయి  కాబట్టి  దేవుణ్ణి మతాన్ని  నమ్ముకుని ఎవరికీ వారు తమలో  ఉండే మురికిని కడిగేసుకోవచ్చు అని ఈజీగా చెప్పే వాళ్ళున్నారు. ఒక వేళ అదే నిజమైతే వివిధ మాతచార్యులు చేసే అకృత్యాలు ఎలా జరుగుతున్నాయి. సమాజంలోని అందరి కాలుష్యాన్ని కడిగి పారేసే వాళ్ళు తమ స్వంత మురికిని కడుక్కోలేరా?   అందుకే  మతం ఈ విషయంలో సక్సెస్ కాలేదని  మనందరికీ తెల్సు. మరి పరిష్కారం ఎక్కడ  వెతుకుదాం. మనలోనా? సమాజంలోనా? మతం లోనా?  ఈ ప్రశ్నకు సమాదానం చెప్పే  శక్తి కేవలం సైన్సుకే వుంది.  అయితే సైన్సు కూడా పెట్టుబడీ దారుల చేతుల్లోకి వెళ్లి పోయిందనే వాదన ఉంది.  

కానీ సైన్సు ఎవరి సొత్తు కాదు. సైన్సు యూనివర్సిటీలలో, పెద్ద పెద్దల్యాబుల్లోనో, ఖరీదైన పరికరాల్లోనో ఉంటుందనే భావ దారిద్ర్యంలో ఉండే వారికి నేను చెప్పేదేమీ లేదు. ప్రపంచాన్ని సమూలంగా మార్చేఅతి పెద్ద ఆవిష్కరణలు మాత్రేమే సైన్స్ మిగతావాటిని చిల్లర సైన్సు చేష్టలు అనుకునే వారికి కూడా నేను దూరంగా ఉంటాను. ఇక మత గ్రంధాలలో ఉన్నది మాత్రమే సైన్స్ అనుకునే వారితో వాదించటం అనవసరం సైన్సు కు చిన్న పెద్ద తేడా లేదు దానిపై ఎవరి గుత్తాధిపత్యం చెల్లదు. అది ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక కాలానికో పరిమితం కాదు. అది నిరంతరం అవిశ్రాంతంగా కొనసాగే ఒక సాధారణ ప్రక్రియ. ఇంకా గట్టిగా వాదిస్తే రోజు వారీ జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు మతేతర పరిష్కారాలు కనుగునే ప్రయత్నం చేస్తున్న ప్రతీ వ్యక్తి ఒక సైన్టిస్టే . వాళ్లకు ఎలాంటి డిగ్రీలు ఉండవు, పేటెంట్లు ఉండవు. 

మనలో ఉండే భావోద్రేకాలకు కావలసినంత రా మెటీరియల్ మనలోనే ఉంది. సెక్సు కోరికలకు కారణం హార్మోన్లంటారు. స్వార్ధానికి, అసూయకు,  భవిష్యత్తు గురించిన ఆలోచనలకు, అందరిపైనా పెత్తనం చెలాయించాలనే రాజకీయ కోరికలను ప్రేరేపించే దుర్భుద్దీ ఇవన్నీ కూడా మనలో ఉండే భౌతిక రసాయన ప్రక్రియల  తాలూకు బాహ్య రూపాలు.  కాబట్టి  మార్క్స్ భౌతిక వాదం ఆర్ధిక రాజకీయం వంటి మాక్రో లెవల్  అంశాలకే పరిమితం కాకుండా ఇంకా మైక్రో లెవల్ కు కూడా వెళ్ళగల్గితే బావుండేది .  ఒక్క అసూయకు కారణం, మందు కనిపెట్ట గలిగితే చాలు సమకాలీన సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే అంక్జైటీ న్యురోసిస్ వంటి వాటికి మందులున్నాయి అంటారు. అలాగే పిచ్చి వాళ్లపై కూడా కొన్ని మందులు పనిచేస్తాయి. కొందరు ప్రతీ పనిలో నెగెటివ్ అంశాలు మాత్రమే చూస్తారు మరికొంత మందికి పాజిటివ్ మాత్రమే కనపడుతుంది.    మనిషిలో ఉండే భావోద్రేకాలు బయలాజికల్ అనివార్యాలా లేక  సోషల్ రిడన్డెసీలా అన్న విషయం  తేలాలి. ఎందుకంటే భయం కూడా ఒక భావమే మనిషి నుండి భయాన్ని తొలగిస్తే చాల సమస్యలోస్తాయి.  పాజిటివ్ ఆలోచనలతో పాటు నెగిటివ్ ఆలోచనలు కూడా అవసరం విమానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తకు దాన్ని గాలిలో ఎగిరేయ గల్గితే సరిపోదు దాన్ని కిందకు ఎలా దించాలో కూడా తెలియాలి. శాస్త్ర పరిశోధన ఇంకా చాలా ముందు కెళ్తే తప్ప సామాజిక రుగ్మతలకు పరిష్కారం దొరకదు.  భూమి కోసం రాజకీయ పోరాటమే కాదు శాస్త్రీయ పరిశోధన కూడా అవసరం. భూమి లేక పొతే దాన్ని సృష్టించే శక్తి సైన్సుకు ఉంది శూన్యంలో పంటలు పండించగల తెలివి శాస్త్ర విజ్ఞానికి ఉంది.  సెప్టిక్ టాంక్ మరుగుదొడ్డి  కనుగొనక పొతే నెత్తిన చీపురు  బకెట్ పెట్టుకుని ఇంటింటికి తిరిగే స్కావెంజర్ వ్యవస్థ ఇంకా ఈ రోజు కూడా సజీవంగా  ఉండేది.  అలాగని ఆ వ్యవస్థ  పూర్తిగా పోయిందన్న అపోహలో ఉండకండి. డ్రైనేజి మాన్ హోల్లో దిగి చెత్తను తొలగించి మురికి నీటికి దారిని క్లియర్ చేసే మున్సిపల్ ‘చెత్త మనిషి’ రూపంలో, మన ఇంట్లో సెప్టిక్ టాంక్ నిండి నప్పుడు దాన్ని ఎత్తి పోసే వ్యక్తుల రూపంలో ఇంకా బతికే ఉంది. జేసీబీలు, బుల్డోజర్లు  కనిపెట్ట బడక పొతే తట్టా, పారా,  గునపాలకు ఇంకా ఫుల్ గిరాకీ ఉండేది.     అంతెందుకు కార్లు, రైళ్ళు, బస్సులు  ఇంకా హైడ్రో కార్బన్ లేక విద్యుత్  చోదక యంత్రాలు లేక పొతే ఇంకా పల్లకీలు, మేనాలు తప్పక బతికి ఉండేవి.    ఇంతకీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం సూటిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే చాల మంది మార్కిస్టు లకు రాజకీయ పోరాటాలపై ఉన్న నమ్మకం సైన్సు పై లేదు. అలాగని ఆర్ధిక రాజకీయ పోరాటాలను తక్కువ చేసి చూపించే ఆలోచన లేదు.  మార్క్స్ చెప్పిన చరిత్ర దశల ట్రాన్సిషన్ లో సైన్సు పాత్రను పూర్తిగా విస్మరించారో లేక దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదో  తెలియదు. మన చుట్టూ ఉండే ప్రజల సమస్యలకు రాజకీయార్ధిక పరిష్కారాలతో పాటు సైంటిఫిక్ ఆవిష్కరణలు తోడైతే సమాజ మార్పు వేగం పుంజుకుంటుందని నా ఆశ. చివరిగా మనిషిని అంతర్గతంగా  మతం దృష్టిలో కాకుండా మార్క్స్ పంథాలో భౌతిక వాద దృష్టిలో స్కాన్ చేసి భావోద్రేకాలకు మనిషిలో భౌతిక రసాయనిక చర్యలను కనుగొని వాటిని నియంత్రించ గల్గితే ప్రయోజనం ఉండొచ్చు.  మార్క్సిజాన్నీ ప్రశ్నించే సాహసం చేసిన  నా అవివేకాన్ని మన్నించాలని   కొరుతూ  - ప్రదీప్