పేజీలు

9, ఆగస్టు 2014, శనివారం

Management of Government and Private Infrastructure

కొత్త విద్యాలయం  ప్రారంభించాలంటే కొత్త  భవన నిర్మాణం  చెయాల్సిందేనా?
అప్పుడప్పుడు నాకో అనుమానమొస్తది.  కొత్త్తగా ఒక స్కూలో, లేకపోతె ఒక కాలేజో షురూ జేయ్యలంటే కొత్త బిల్డింగ్ కట్టాల్సిందేనా?.  ఒక చిన్న మాటచెప్త.   నేనొక  గౌర్మెంట్  కాలేజీల లచ్చరర్ పనిజేస్త.  ఆ కాలేజి యాడాది మొత్తంల 200 దినాలు పనిజేస్తది అదికూడా రోజుకు 8 గంటలు.  ఇది ఎంత అన్యాయమో  సూద్దామా ? ముందుగల్ల ఆ బిల్డింగ్ ప్రజల పైసలతోని  కట్టిందన్న ముచ్చట మరువద్దు.  మా కాలేజీల 40 దాక రూములు, ఐదారు వందల బెంచీలు కుర్శీలు, ఫాన్లు, కంప్యూటర్లు ఇట్ల కోట్ల  రూపాయల సామాను  ఉంటది.  కానీ దాన్ని యాడాదిల 200 రోజులు, రోజుకు 8 గంటలు లెక్కల ఇస్తమాల్ జేస్తే అంత నష్టమే గాని ఎమన్నా ఫాయిదా ఉన్నదా?  ఒక్క సారి లెక్క జేసి సూద్దాం! అసలు యాడాదికి ఎన్ని  గంటలుంటయో  తెల్సా ?  365 X 24 = 8760 గంటలు . అసుంటిది మనం వాడుకుంటున్నది  200 X 8 = 1600  గంటలు.  ఇంటుంటె  గమ్మతనిపిస్తున్నది గదా!  గమ్మతు గాదు. నెం జెప్పేది నిదానంగా ఆలొచన జెయ్యిండ్రి, మీకే  అర్దమైతది. ఆ రూములు, బెంచీలు, కుర్చీలు , కంప్యూటర్లను రోజుకు కనీసం 16 గంటలు వాడుకోవచ్చు.  అట్లనే యాడాదికి కనీసం 300 రోజులు వాడుకుంటే  4800 గంటలు  పనిజేసినట్లుంటది. ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో కంపీనీలు గట్లనే పనిజేస్తున్నాయి గదా? గట్లనే మనంకూడా పనిజేద్దాం !   ఇంక మా ఊళ్ళే  ఐదారు ప్రైవేటు డిగ్రీ కాలేజిలు, జూనియర్ కాలేజీలున్నాయి.  అవ్వి గూడ గట్లనే పనిజేస్తయి.  పాపం లక్షలు ఖర్చు వెట్టి కాలేజీలు స్కూల్లు  పెడ్తరు. మల్ల అంత  పోగోట్టుకుంటరు.  అందుకని వాల్లక్కూడ ఈ మం త్రం పనిజెస్తది. ఓ ప్రైవేటు కాలేజీల స్కూల్ల దొరలూ!  మీరు కూడ  మీ బిల్డింగులను రోజుకు 24 గంటలు గాక పోయినా కం సే కం  16 గంటలు పనిజేసేటట్లు సూడుండి.  మీకు,  మీ సుట్టూ  ఉన్నోల్లకు  లాభం జేసినట్లయితది.  గప్పుడే మన తెలంగాణ ముందుకు వోతది ,  అందుకేంజెయ్యాల్నో జెప్త.

అన్నలూ ఇగ  షురూ  చేద్దామా ?  ప్రతి కొత్త ఆఫీసుకు, ప్రతీ కొత్త కాలేజి, స్కూలు  ఏది మొదలు వెట్టిన ప్రతీసారి కొత్త బిల్డింగ్ కట్ట మంటే పైసల్  మస్తు గావాల్నాయ్. పోనీ దాన్ని పూర్తిగా వాడుకుంటమా అంటే అదీ లేదు.
గిట్లయితే ఎట్ల.  అందుకే ఇప్పుడు ఎట్ల జయ్యాలె ఎం జెయ్యాలె చెప్త.  ఉదారణకు,  నేను చిన్నప్పుడు సదువుకున్న ఇస్కూలు సంగతి సూద్దాం. నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా పరిషత్ హై  స్కూల్ల పదవ తర్గతి పాసైన. నిజంగానే గా స్కూలును జూసినప్పుడల్ల నాకు మస్తు బాధనిపిస్తది.  నా అసుంటోల్లకు  వందల వేల మందికి సదువు జెప్పి ఒక దారి సూపిచ్చింది.  పేద్ద మైదానం. మల్ల ఊరు నడిమిట్ల ఉన్నది.  అదే బిల్డింగ్ ను ఇంకా పెద్దగ జేసి వంద రూములు ఇయ్యాల కొత్తగచ్చిన కంప్యూటర్లతోని పాఠం చెప్పిచె   LED ప్రొజెక్టర్లు ఇంకా, పెద్ద ఆన్ లైన్ లైబ్రరి, ఇంక కావల్సిన అన్ని ఇవ్వాలె.  దానికొక  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను పెట్టాలె. పొద్దుగాల్ల 4నుంచో 5నుంచో  క్లాసులు షురూ  చేస్తే రాత్రి పది దాక ఎవ్వల్లు కావాలంటే వాల్లు దాన్ని వాడుకోనేతట్లు  చెయ్యలే.  ఒక కాలేజో లేక పొతే ఒక స్కూలొ  తక్కువ టైం లో పూర్తయ్యే సర్టిఫికేట్ కోర్సులో ఇట్ల ఎంతన్న వాడుకోవచ్చు. గట్లనే అన్ని ప్రైవేటు బిల్డింగులు కూడా తాయారు గావాలె.  అప్పుడు కొత్త కోర్సులు కావాలంటే ఎందుకు రావు. ఉద్యోగాలు దొరుకు మంటే ఎందుకు దొర్కవు .  అన్ని అవుతయి.  అర్ధమయిందా నేను చెప్పింది.   మరి ఇయ్యాలటికీ జై తెలంగాణా!














2, ఆగస్టు 2014, శనివారం

New Education Policy

 నూతన విద్యావిధానం 

        ముఖ్య మంత్రి  కే.సి. ఆర్ పదే పదే కేజి నుండి పీజీ వరకు ఉచిత విద్య గురంచి ప్రస్తావిస్తున్నారు. మంచి ఆలొచనే.  కాదనడానికి లేదు.  కానీ ఇందులో కొన్ని పాలనా పరమైన, ఆర్ధిక ఇంకా కొన్ని  సామాజిక  పరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. 

         మొదటగా  ప్లస్ 2 (ఇంటర్ మీడియట్ )  వరకు ఉచిత విద్య ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఆ తర్వాతే సమస్య. యూ. జి . సి. ఇటివల తీసుకొస్తున్న ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం   స్పష్టంగా  కనిపిస్తున్నది. యునివర్సిటి గ్రాంట్స్ కమీషన్, దాని అనుబంధ సంస్థ  NAAC, ప్రతిపాదిస్తున్న కార్యక్రమ సరళి బట్టి చూస్తె ఉన్నత విద్యాసంస్థలు అంటే అండర్      గ్రాడ్యుయేషన్, ఆపైన  కోర్సులకు  సంబంధించిన విద్యాసంస్థలు తమ మనుగడ కోసం అవసరమైన నిధులను తామే సమకూర్చుకోవల్సిన సమయం ఆసన్నమైనట్లుగా అనిపిస్తుంది.  ఒకవేళ యూ. జి.సి, లేక కేంద్ర ప్రభుత్వ విధానం కూడా అదే అయితే విద్యాసంస్థలు తమ మనుగడకోసం తప్పని సరిగా విద్యార్ధుల ఫీజుల పైనే అధారపడాల్సి వస్తుంది. అప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా  తమ విద్యా సంస్థల భారాన్ని      కొంత మోయక తప్పదు. అందుకే ఈ వ్యాసం(విద్యార్థుల ) నినాదం " విద్య  సమాజం ఇచ్చే దానం కాదు - విద్య ప్రతి  విద్యార్థి  హక్కు"కావాలి.  అందుకోసం ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి 

1.  డిగ్రీ విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు కల్పించాలి . 
2.  25 నుండి 40 శాతం వరకు ప్రైమరీ స్థాయి  ఉపాధ్యాయుల పోస్టులను 
     డిగ్రీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. 
3.  వారికే శిక్షణ ఇచ్చి వారి సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. 
4.  ఈ టీచర్  విద్యార్థులకు పిరియడ్ కు కొంత మొత్తాన్ని చెల్లించాలి. 
5. అందులోనుండే ఆ విద్యార్థి తన చదువు కు కావలసిన డబ్బులను 
    సంపాదించుకోవాలి  అంటే పోషణ, గృహవసతి భారాన్ని  తల్లిదండ్రులు

భరిస్తారు ఇక చదువుకు అవసరమైన ఖర్చులలో కొంత తన స్వంత సంపాదన పై ఆధార పడవచ్చు.   మొత్తం మీద విధ్యార్థుల మనస్సుల్లోనుంచి ఉచిత విద్య భావనను పూర్తిగా తుడిచి వెయ్యాలి.  పైగా దేశ భవిష్యత్తుకు మూల కారకులైన యువత తమ  జీవిత కీలక దశలో, అంటే 16 సంవత్సరాల వయసు నుండి 25 సంవత్సరాల వయసు వరకు  వారి మనసిక, శారీరక శక్తి యుక్తులను ఉపయోగించుకొవాలంటె ఆ దశలో వారిని చదువుకు, పనికి రెండింటికి ఉపయోగించుకోవాలి. విదేశాలలో చదువుకునే మన విద్యార్థులు  చాలా మంది ఒక వైపు చదువుకుంటూనే, తమ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకుంటున్నారు.  మరికొంత మంది తమ చదువులకు, ఇతర  అవసరాలకు కావలసిన డబ్బులతో సంపాదించడంతో  పాటు కొంత సొమ్మును ఇంటికి కూడా పంపిస్తున్నారు.   చాలా దేశాల్లో నిర్ణిత వయసు దాటినా యువతీ  యువకులు తప్పనిసరిగా తమ బతుకు తాము బతకాలసిందే.  ఉదాహరణకు అమెరికా లో 14 సంవత్సరాలు పిల్లలు సంపాదనలో పడతారు. అలాగే మన దేశం లో కూడా ఉన్నత విద్యను ఉచితంగా కాకుండా వారి కష్టం తో నే చదివేలా చేయగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించాలి.  ఏదో ఒక పార్ట్  టైం ఉద్యోగం కల్పించి తద్వారా వచ్చిన పైకంతో కనీసం ఫీజులు కట్టుకునేలా చేయగలిగితే చదువు విలువ తెలుస్తుంది.  ఊరికే వచ్చిన చదువుల  పట్ల విద్యార్థులకు సరైన అవగాహన లేకుండా  ప్రభుత్వం కల్పించిన స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారు.  కాబట్టి స్కాలర్ షిప్పుల కు బదులు పార్ట్  టైం ఉద్యోగాలు కల్పిస్తే విద్యా వ్యవస్థ తీరు మారే అవకాశం ఉంది.